తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకుచెందిన సూర్యదీపిక విద్యలో సత్తా చాటి ఘనతను సాధించింది. హైదరాబాద్ అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (ఎఫ్సీఆర్ఐ)కి చెందిన ఓ విద్యార్థిని అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఆబర్న్ యూనివర్సిటీలో ఎంఎస్ ఉచిత సీటును సాధించింది. దీపిక ఎఫ్సీఆర్ఐలో ఫారెస్ట్రీ కోర్సు చివరి సంవత్సరం చదువుతుంది. ఇంకా ఆమె తుది పరీక్షలు రాయాల్సి ఉండగానే ఈ అరుదైన అవకాశం దక్కించుకుంది. ఫారెస్ట్రీ కోర్సులో ఆమె ప్రతిభను చూసిన ఆబర్న్ యూనివర్సిటీ ఎంఎస్లో సీటు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. రెండేండ్ల కోర్సుకుగాను ఫీజు మాఫీతోపాటు ప్రతినెల ఉపకారవేతనం కూడా ఇవ్వనుంది.
రెండేండ్ల వ్యవధిగల ఈ కోర్సు ఫీజు ఏడాదికి 15వేల డాలర్ల (సుమారు రూ.11.4 లక్షలు)వరకు ఉండగా దాన్ని మాఫీ చేసి నెలకు 1500 డాలర్ల (సుమారు రూ.1.14 లక్షలు) ఉపకారవేతనాన్ని కూడా యూనివర్సిటీ మంజూరచేసింది. కాగా తన కలను నిజం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్కు, కళాశాల యాజమాన్యానికి దీపిక కృతజ్ఞతలు తెలిపింది. అమెరికాలో తాను ఎంఎస్ చదువుతానని అసలు ఊహించలేదని సూర్యదీపిక తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఆబర్న్ యూనివర్సిటీలో డాక్టర్ జన్నా విల్లాగ్ నేతృత్వంలో జెనెటిక్స్, వన్యప్రాణులపై సూర్యదీపిక అధ్యయనం చేయనుంది.