తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా మాజీ మంత్రి టి.పద్మారావుగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విపక్షాల మద్దతుతో ఆయన ఎన్నిక కావడం విశేషం. పద్మారావు ఎన్నికపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సోమవారం సభలో అధికారిక ప్రకటన చేయనున్నారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియలో భాగంగా శనివారం నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే సమయానికి పద్మారావుగౌడ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.
కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపాయి.డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సహకరించాలని టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎల్పీ కార్యాలయానికి వెళ్లి గంటన్నరపాటు అక్కడే ఉన్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్తో సుదీర్ఘంగా చర్చించి వారి మద్దతు కూడగట్టారు.