నేను త్వరలో మీ ముందుకు వస్తాను : ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కూడా కరోనా బారిన పడిన విషయం అందరికీ తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కూడా కరోనా బారిన పడిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఆయనకు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ద్వారానే వైరస్ సోకినట్టు తెలుస్తోంది. దీంతో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే వైద్యుల సూచనలను పాటిస్తూ హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉన్న ఆయన నివాసంలోనే చికిత్స పొందుతున్నారు. ఇక ఆయనకు కరోనా సోకిందనే విషయం తెలియగానే ఆయన అభిమానులు ఒక్కసారిగా దిగాలు చెందారు. వారిని దృష్టిలో పెట్టుకున్న ఎమ్మెల్యే బుధవారం ఓ వాట్సప్ వీడియో సందేశాన్ని విడుదల చేసారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తన గురించి ఎవరూ దిగులు చెందకూడదని తెలిపారు. అతి త్వరలోనే ఆయన కరోనా నుంచి కోలుకొని నియోజకవర్గ ప్రజలను కలుస్తానని చెప్పారు.
ఆ వీడియోలో ప్రజలకు ఆయన ఇచ్చిన సందేశాన్ని చూసుకుంటే నేను బాగానే ఉన్నాను. ఎవరూ అధైర్యపడొద్దు. త్వరలో నేను చేయించుకోబోయే టెస్ట్లో నెగెటివ్ వస్తుందని ఆశిస్తున్నాను. దయచేసి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి. అందరు తప్పకుండా మాస్కులు ధరించండి. సామాజిక దూరం పాటించండి. అన్ని జాగ్రత్తలు తీసుకున్న నేనే కరోనా బారిన పడ్డాను. నాపై ప్రేమ చూపిన ప్రజలకు, అభిమానులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. మీ ముందుకు త్వరలోనే వస్తాను. నిజామాబాద్ నగర ప్రజలు ఎవరూ కూడా నాలాగా కరోనా బారిన పడొద్దని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను' అని గణేష్ గుప్తా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.