ప్రైవేటు వర్సిటీల్లో డిమాండ్ ఉన్న నూతన కోర్సులు... అవి ఏంటో తెలుసా..
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఐదు ప్రైవేటు వర్సిటీలలో ప్రస్తుతం ఉన్న కోర్సులను మాత్రమే కాకుండా డిమాండ్ ఉన్న నూతన కోర్సులు కూడా ప్రవేశపెట్టాలని సంస్థలు యోచిస్తున్నాయి.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఐదు ప్రైవేటు వర్సిటీలలో ప్రస్తుతం ఉన్న కోర్సులను మాత్రమే కాకుండా డిమాండ్ ఉన్న నూతన కోర్సులు కూడా ప్రవేశపెట్టాలని సంస్థలు యోచిస్తున్నాయి. ఇప్పటికే ఆయా కళాశాలల్లో రెగ్యులర్ కోర్సులను నడిపిస్తున్నారు. వాటితో పాటుగానే ఐవోటీ, రోబోటిక్స్, సైబర్సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మిషన్ లెర్నింగ్ (ఎంఎల్) వంటి కొత్త కోర్సులను విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేసారు. ప్రభుత్వానికి విశ్వవిద్యాలయాల అనుమతి కోసం చేసిన దరఖాస్తుల్లో ఈ విషయాన్ని యాజమాన్యాలు స్పష్టంచేశాయి. నూతన వర్సిటీల్లో జేఈఈ, ఎంసెట్ ర్యాంకుల ప్రకారమే విద్యార్ధులకు అడ్మిషన్లు ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ ఏడాది మొదటి సంవత్సరం నుంచి మాత్రమే వర్సిటీలుగా అవి చెలామణి అవుతాయి. బీటెక్ సెకండియర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ విద్యార్థుల వరకు కాలేజీలుగానే కొనసాగనున్నాయి. ఇక 2020-21 విద్యాసంవత్సరంలో అడ్మిషన్ల ప్రక్రియకు జూన్ లేదా జూలైలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
ఇక పోతే గత బుధవారం రోజున రాష్ట్రంలో కొత్త ప్రయివేటు వర్సిటీలను అనుమతిస్తూ ఫైల్ పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతకంచేశారు. రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీల స్థాపన కోసం 13 విద్యాసంస్థలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. కాగా వాటిలో మహీంద్రా, వాక్సన్, మల్లారెడ్డి, ఎస్సార్ యూనివర్సిటీ వరంగల్, అనురాగ్ వర్సిటీలు మాత్రమే అనుమతి పొందాయి.
ఆమోదం పొందిన యూనివర్సిటీలు 2020-21 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు నిర్వహించనున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎన్వోటీ) మల్లారెడ్డి, మహీంద్రా, అనురాగ్, వాక్సన్, ఎస్సార్ వరంగల్, గురునానక్, శ్రీనిధి, నిక్మర్, ఎంఎన్నార్ సంస్థలకు జారీచేసింది. ఇవి కాకుండా విజ్ఞాన్ రత్తయ్య, వాగ్దేవి వరంగల్, అమిటీ, రాడ్క్లిఫ్ సంస్థలకు అనుమతి రావాల్సి ఉన్నది. 2020-21లో ప్రారంభమయ్యే బ్యాచ్లే వర్సిటీలుగా కొనసాగనున్నాయి. ఈ విద్యాసంస్థలు వర్సిటీలుగా మారినప్పటికీ ప్రస్తుతం వాటిల్లో చదువుతున్న విద్యార్థుల వరకు కాలేజీగానే కొనసాగుతాయి.