ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలి : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలందూ భాగస్వాములు కావాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలందూ భాగస్వాములు కావాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం కొమురం భీం జిల్లా కేంద్రంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే పచ్చదనం-పరిశుభ్రత విజయవంతమవుతుందని ప్రజలకు, అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలను అభివృద్ది చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతటి మంచి కార్యక్రమాలను రూపుదిద్దుకున్నాయన్నారు.
కౌన్సిలర్లందరూ తమ వార్డుల్లో చేపట్టనున్న పనుల గురించి ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి పనుల్లో ముందుకెళ్లాలని తెలిపారు. ప్రతి వార్డుకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు వార్డుల్లో రూపొందించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాగంగా శ్మశానవాటికలు, పార్కుల ఏర్పాటు చేయాలని, వాటిని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. దాంతో పాటుగానే హరితహారం కార్యక్రమం, పారిశుధ్యం, విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.
పట్టణ ప్రగతి లో ప్రజల భాగస్వామ్యం కీలకమని, మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పనులను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేరు కోణప్ప, జడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మి, ఆసిఫాబాద్ కలెక్టర్ సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.