కరోనా సోకిందేమోనన్న భయంతో బాల్కనీ నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు . ఈ ఘటన హైదరాబాద్లోని రామంతాపూర్లో ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది. వాసిరాజు కృష్ణమూర్తి(60) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి రామంతాపూర్లో నివాసం ఉంటున్నాడు. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న కృష్ణమూర్తి తరచు ఆయాసం రావడంతో కరోనా సోకిందేమోనని ఆందోళన చెందాడు. కుటుంబ సభ్యులు కింగ్కోఠి ఆసుపత్రికి తీసుకెళ్లగా..కరోనా లక్షణాలు లేవని వైద్యులు తేల్చారు.
అయినప్పటికీ వాసిరాజు ఆందోళన చెందుతుండటంతో గాంధీ ఆస్పత్రికి వెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. శనివారం ఉదయం గాంధీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న క్రమంలో వాసిరాజు తమ బాల్కనీ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.