కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఉద్యోగుల వేతనాల్లో కోత విధించిన సంగతి తెలిసిందే. జీతంలో కోత పడటంతో... ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ నెల నుంచైనా పూర్తి వేతనం ఇవ్వాలని కోరుతూ.. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ మరియు కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక పక్షాన కొంతమంది ప్రతినిధులు మంగళవారం ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావును కలిసి వారి సమస్యలను వివరించారు.
జీతాల్లో కోతలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. జూన్ నెల వేతనంలో ఎలాంటి కోతలు లేకుండా పూర్తి జీతాలు చెల్లించాలని కోరారు. అయితే, వారి సమస్యలు విన్న మంత్రి హరీశ్రావు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అనంతరం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ జూన్ నెల నుండి పూర్తి వేతనాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడానికి మంత్రి అంగీకరించినట్లు వారు వెల్లడించారు.