తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిమ్స్ ఆసుపత్రిని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సందర్శించారు. కరోనా బారిన పడిన వైద్యులు, సిబ్బందిని స్వయంగా వెళ్లి పరామర్శించారు. అనంతరం నిమ్స్ ఆసుపత్రి వైద్యాధికారులతో ఆమె చర్చించారు. డాక్టర్లకు కరోనా టెస్టులు చేయాలని ప్రభుత్వాన్ని కోరతానని గవర్నర్ తెలిపారు.
రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఐసీఎంఆర్ నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ వాటి సంఖ్య మరింత పెంచాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందనే విశ్వాసాన్ని తమిళిసై వ్యక్తం చేశారు. నిమ్స్లో ఇప్పటి వరకు నలుగురు ప్రొఫెసర్లు, 8 మంది రెసిడెంట్ వైద్యులు, 8 మంది పారామెడికల్ సిబ్బంది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.