సోషల్ మీడియాలో వదంతులు నమ్మవద్దు: సీపీ సజ్జనార్
గత కొంత కాలంగా ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వైరస్ తెలంగాణలో కూడా సోకిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలంతా ఎంతగానో భయాందోళనకు గురవుతున్నారు.
గత కొంత కాలంగా ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వైరస్ తెలంగాణలో కూడా సోకిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలంతా ఎంతగానో భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం సైబరాబాద్ సీపీ సజ్జనార్ కరోనా వైరస్పై ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నగరంలోని వివిధ ఐటీ కంపెనీలకు చెందిన సీఈవోలు, హైసియా మెంబర్స్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధులు హజరయ్యారు. ఈ సమావేశంలో సీపీ సజ్జనార్ మాట్లాడుతూ కరోనాపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. ఈ వదంతుల కారణంగా ఐటీ కారిడార్లలో ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు.
రెండు రోజుల క్రితం మైండ్ స్పేస్లో ఓ ఐటీ కంపెనీ ఉద్యోగినికి కరోనా సోకిందన్న వదంతులు వచ్చాయని ఆయన తెలిపారు. కానీ ఆ వదంతుల్లో సత్యం లేదని, ఆమెకు ఎలాంటి వైరస్ సోకలేదని, వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఫలితం నెగిటివ్ వచ్చిందని వెల్లడించారు. హైదరాబాద్లో కరోనా సోకకుండా వైద్యులు జాగ్రత్తలు తెలిపుతున్నారని తెలిపారు. కరోనా అనుమానితుల కోసం గాంధీ ఆస్పత్రితోపాటు 40 ప్రైవేట్ ఆసుపత్రులలోకూడా ఐసోలేషన్ వార్డులను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
రెండు రోజుల క్రితం నగరంలో పరిస్థితులు ఎంతో భయానకంగా ఉందని, ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉందని తెలిపారు. హైదరాబాద్ లో ఐటీ రంగానికి మంచి పేరు ఉందని, ఈ విధమైన వదంతులను సృష్టించి మంచి పేరును పోగొట్టొద్దని తెలిపారు. నగర వ్యాప్తంగా 5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పని చేస్తున్నారని ఎవరూ భయపడకూడదని తెలిపారు. ఐటీ కారిడార్లో సైబరాబాద్ పోలీసులు, హైసియా, సొసైటీ ఫర్ సైబర్ సెక్యురిటీ కౌన్సిల్, ఐటీ కంపెనీలతో కలిసి కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనాపై ఏవైనా అపోహలుంటే సైబరాబాద్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.