తెలంగాణ పీఏసీ చైర్మన్‌ ఎవరంటే..

Update: 2019-01-20 03:12 GMT

అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీకి లభించే ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌ పదవి కాంగ్రెస్‌కు దక్కనుంది. 19 మంది శాసనసభ్యులతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఈ పదవి కాంగ్రెస్ చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. వనమా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తర్వాత ఎక్కువ సార్లు గెలుపొందిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో సీనియర్‌ వనమా.

పీసీసీ అధ్యక్షుడిగా ఓసీ వర్గానికి చెందిన ఉత్తమ్‌ ఉండటంతో సీఎల్పీ నేతగా ఎస్సీ ఎమ్మెల్యే బట్టి విక్రమార్కను ఎంపిక చేయడం, పీఏసీ చైర్మన్‌ పదవిని బీసీ వర్గానికి కేటాయిస్తారని, అది కూడా బీసీల్లో సీనియర్‌ ఎమ్మెల్యే అయిన వనమానే పీఏసీ పదవికి ఎంపిక చేస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది. కాగా ప్రతిపక్ష పార్టీలో ఎక్కువ సార్లు గెలిచిన సీనియర్‌ ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్‌ పదవి ఇవ్వడం సాంప్రదాయంగా వస్తుంది. గతంలో నారాయణ్‌ఖేడ్‌ నియోజకవర్గం నుంచి 4 సార్లు గెలిచిన పి.కిష్టారెడ్డి, పాలేరు నుంచి ఐదుసార్లు గెలుపొందిన రాంరెడ్డి వెంకటరెడ్డి, జహీరాబాద్ నుంచి గెలుపొందిన గీతారెడ్డి ఈ పదవిని నిర్వర్తించారు. 

Similar News