ఖమ్మం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఫరీద్బాబు సోమవారం ఉద్యోగ విరమణ పొందనున్నారు. అయితే ఎప్పటినుంచో తనకు ఎస్సైగా రిటైర్ అవ్వాలన్న కోరిక ఉండేది. కానీ ఎస్ఐగా పదోన్నతి రావాల్సి ఉన్నా రాలేదు. దాంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యేవారు. చివరకు ఉద్యోగ విరమణ పొందే రోజు కూడా వచ్చింది. ఎస్ఐ అవ్వాలన్న కోరిక మాత్రం తీరకుండానే రిటైర్ అవుతున్నానన్న బాధ ఆయనలో ఉంది.
ఈ క్రమంలో ఆయన సేవలను గుర్తించారు సీపీ తఫ్సీర్ ఇక్బాల్. ప్రత్యేక చొరవతో ఫరీద్బాబుకు ఎస్ఐగా పదోన్నతి కల్పిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఎస్ఐ పదోన్నతి రావడంతో ఎస్సై ఫరీద్బాబు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అనంతరం ఎస్ఐగా ఉద్యోగ విరమణ పొందారు. కాగా ఎస్సై ఫరీద్బాబు సీపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.