రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు రెవెన్యూ అధికారుల అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. ఓ రైతు నుంచి 4లక్షలు లంచం తీసుకుంటూ కేశవపేట్ తహసీల్దార్ లావణ్య ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఈనేపథ్యంలో హయత్నగర్లోని ఆమె ఇంట్లో తనిఖీలు చేసిన అధికారులు గుర్తించిన నగదు, ఆభరణాలు చూసి షాక్ అయ్యారు. సోదాల్లో ఇప్పటి వరకు 93లక్షల 50 నగదుతోపాటు 400 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు తేలడంతో లావణ్యను అరెస్టు చేశారు. నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు. సాయంత్రానికి ఆమెను ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆమె భర్త వెంకటేశ్ పరారీలో ఉన్నాడు.
కేసంపేట మండలం దత్తాయపల్లి గ్రామానికి చెందిన రైతు మామిడిపల్లి చెన్నయ్య పేరిట 12 ఎకరాల పొలం ఉంది. ఈ పొలానికి సంబంధించిన డిజిటల్ పాస్ పుస్తకాలు ఆన్లైన్లో నమోదు చేయడానికి వీఆర్వో అనంతయ్య, తహసీల్దార్ లావణ్య డబ్బు డిమాండ్ చేశారు. అందులో భాగంగా 4లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.