అంబటి రాయుడిని నాలుగో స్థానంలో ఆడించాలి

Update: 2019-05-15 11:40 GMT



వరల్డ్ కప్ ముందున్న వేళ ఎవరిని ఎక్కడ ఆడించాలి.. ఎవర్ని టీంలో ఉంచాలి.. టీం కూర్పు ఎలా ఉండాలన్న సలహాలు మొదలైపోయాయి. నిన్నటి దాక ఐపీఎల్ హడావుడిలో ఉన్న మన క్రికెటర్లు ఇంకా కుదురుకొనే లేదు. తరుముకు వస్తున్న ప్రపంచ కప్ హడావుడి మొదలైంది. అన్నిటికన్నా ముఖ్యంగా టీం కూర్పు విషయమై మాజీలు వరుసగా సలహాలిస్తున్నారు. అందులో తాజాగా కిర్మాణి కూడా చేరాడు.

వరల్డ్ కప్‌కి ఎంపికైన భారత జట్టులో సభ్యుడైన కేదార్ జాదవ్ భుజం గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో చెన్నై తరఫున ఆడిన జాదవ్.. పంజాబ్‌పై ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఆ గాయం ఇంకా తగ్గకపోవడంతో అతడు వరల్డ్ కప్‌కి దూరమైతే అతడి స్థానంలో ఎవర్ని ఎంపిక చేయాలనే ప్రశ్న తలెత్తుతోంది. అక్షర్ పటేల్‌‌ను తీసుకోవాలని కొందరు సూచిస్తుంటే, మరి కొందరు రాయుడి వైపు మొగ్గు చూపతున్నారు. జాదవ్ స్థానంలో రాయుణ్ని జట్టులోకి తీసుకోవాలని 1983 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన సయ్యద్ కిర్మాణీ సూచించారు.

వరల్డ్ కప్‌లో విజయ్ శంకర్ బదులు కేదార్ జాదవ్‌ నాలుగోస్థానంలో ఆడాలన్న కిర్మాణీ.. గాయం కారణంగా అతడు ఫిట్‌నెస్ నిరూపించుకోలేకపోతే.. నాలుగోస్థానంలో అంబటి రాయుడిని ఆడించాలన్నారు. వరల్డ్ కప్ ముందు టీమిండియాకు వన్డే క్రికెట్ ప్రాక్టీస్ లేకపోవడం వరల్డ్ కప్‌లో కోహ్లీ సేనపై పెద్దగా ప్రభావం చూపబోదన్నారు. భారత్ ఆల్‌రౌండ్ సామర్థ్యం పట్ల ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

మరో పక్క కేదార్ జాదవ్ గాయం విషయమై టీమిండియా కోచ్ రవిశాస్త్రి స్పందించారు. లక్కీగా జాదవ్‌ భుజానికి ఫ్రాక్చర్ కాలేదన్న ఆయన.. కేదార్ వరల్డ్ కప్ ఆడే అవకాశాలు ఉన్నాయన్నారు. మరో రెండు వారాల్లో జాదవ్ కోలుకుంటాడని తెలుస్తోంది.  

Similar News