ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ ఫెరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్రైడర్స్ను ఓడించింది. 186 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 10 పరుగులు చేయగా కోల్కతా జట్టు 7 పరుగులే చేసింది. దీంతో ఢిల్లీ జట్టు 3 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
అంతకుముందు మొదట బ్యాటింగ్కు దిగిన కోల్కతా నైట్రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రసెల్ (28 బంతుల్లో 62; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వసం సృష్టించాడు. దినేశ్ కార్తీక్ (36 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో హర్షల్ పటేల్ 2 వికెట్లు తీశాడు. అనంతరం 186 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 20 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగులే చేసింది. పృథ్వీ షా (55 బంతుల్లో 99; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ (32 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. 99 పరుగులు చేసిన యువ ఆటగాడు పృథ్వీ షా కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.