అప్పటివరకు ఐపీఎల్-13 వాయిదా : బీసీసీఐ
కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలపైన పడింది.. ఇక క్రీడారంగం విషయానికి వచ్చేసరికి పలు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరిస్ లు రద్దు అయ్యాయి.
కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలపైన పడింది.. ఇక క్రీడారంగం విషయానికి వచ్చేసరికి పలు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరిస్ లు రద్దు అయ్యాయి. అంతేకాకుండా ఐపీఎల్-13వ సీజన్ కూడా వాయిదా పడింది. అనుకున్న షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్-13వ సీజన్ ప్రారంభం కావాలి. కానీ కరోనా నేపథ్యంలో ప్రజలంతా ఒక్కచోట గుమిగూడితే ప్రమాదం మరింత పెరుగుతుందనే కారణంతో మొదట ఈనెల 15కు వాయిదా వేశారు. ఏప్రిల్ 15 తరవాత ఐపీఎల్-13వ సీజన్ కొనసాగుతుంది అనుకున్న నేపద్యంలో దేశంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో ప్రధాని మోడీ లాక్ డౌన్ ని మరో 19 రోజుల పాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.. ఈ ఏడాది లీగ్ సాధ్యమేనా? అనే సందేహాలు మరింత పెరిగాయి.
ఈ నేపధ్యంలో క్రీడా అభిమానులకి మరోసారి షాక్ ఇచ్చింది బీసీసీఐ.. ఈసారి నిరవధిక వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జయ్ షా అధికారికంగా తెలియజేశారు. ఈ విషయాన్నీ ఫ్రాంచైజీలకు తెలియజేసి తాజాగా దీనిపై ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం వైరస్ నియంత్రణ చర్యలు చేపడుతున్నదని, దానిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే మళ్లీ అనువైన పరిస్థితులు ఏర్పడిన తర్వాతే ఐపీఎల్ నిర్వహణపై తదుపరి నోటీసులు జారీ చేస్తామని వెల్లడించారు.