ఢిల్లీ క్రికెట్ బోర్డు మీటింగ్లో కొట్లాట.. బ్యాన్ చేయాలని గంభీర్ డిమాండ్!
ఢిల్లీ క్రికెట్ సంఘంలో విభేదాలు రచ్చకెక్కాయి. ఆదివారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం రసాభాసగా ముగిసింది. ఏజీఎం సందర్భంగా సభ్యులు ఒకరిపై మరొకరు చేయి చేసుకున్నారు. అధికార వర్గానికి చెందిన సంయుక్త కార్యదర్శి రంజన్ మన్చందాను ప్రత్యర్థి వర్గం ప్రతినిధి మఖ్సూద్ ఆలమ్ చెంపదెబ్బ కొట్టగా అధికార ప్రతినిధి ఓం ప్రకాశ్ శర్మపై కూడా వినోద్ తిహారాకు చెందిన వ్యక్తులు దాడికి దిగారు.
వీడియోను పోస్టు చేసిన గంభీర్ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. డీడీసీఏ చాలా అవమానకరంగా డకౌట్ అయిందని అన్నాడు. ఒకరిపై ఒకరు దాడి చేసుకుని పరువు తీసిన డీడీసీఏను వెంటనే రద్దు చేయాలని, బాధ్యులపై జీవితకాల నిషేధం విధించాలని బీసీసీఐ చీఫ్ గంగూలీ, కార్యదర్శి జే షాలను కోరాడు.
ఇంత గొడవ మధ్యలో అన్ని తీర్మానాలకు ఆమోదం లభించినట్లు ఢిల్లీ క్రికెట్ సంఘం అధికారికంగా ప్రకటించింది. జస్టిస్ బదర్ అహ్మద్ స్థానంలో కొత్తగా జస్టిస్ దీపక్ వర్మను కొత్త అంబుడ్స్మన్గా నియమించారు.