అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 12వ సీజన్ ఇవాళ్టి (శనివారం) నుంచి మొదలుకాబోతోంది. ఒకవైపేమో దేశంలో ఎన్నికల వేడి మరోవైపు ఐపీఎల్ ఫీవర్ తో ఈ సమ్మర్ మరింత హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ప్రపంచకప్కు ముంద 15 రోజుల విరామం ఉండాలన్న నేపథ్యంలో ఐపీఎల్ మొదటిసారి రెండు వారాల ముందే మొదలవుతోంది. ఇవాళ్టి మ్యాచ్ లో భారత దిగ్గజాలు సారధ్యం వహిస్తున్న చెన్నై సూపర్కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్లు తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై మరోసారి హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఎప్పటిలానే కెప్టెన్ ధోనీ చెన్నైకి అతిపెద్ద బలం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టును సక్సెస్పుల్గా లీడ్ చేయడం గురించి ధోనీకి తెలిసినంతగా మరే కెప్టెన్కూ తెలియకపోవచ్చు.
మరోవైపు ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి టైటిల్ ముచ్చట తీరలేదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ కు. ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలని పట్టుదలగా ఉంది. అయితే సక్సెస్ఫుల్ కెప్టెన్గా పేరు తెచ్చుకున్న కోహ్లీకి ఐపీఎల్ లో మాత్రం కలిసి రావడం లేదని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు. కాగా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించరాదని బీసీసీఐ నిర్ణయించుకుంది. ఫలితంగా నేడు నేరుగా మ్యాచ్తోనే లీగ్ మొదలవుతుంది. మ్యాచ్ సమయాల (సా.4 గం., రా. 8. గం.)లో కూడా మార్పు లేదు.