టీమిండియా పై అపజయం తో వచ్చిన కసి కావచ్చు.. ఆస్ట్రేలియా జట్టు శ్రీలంక పై విరుచుకు పడింది. ముందు బ్యాటింగ్ చేసి పరుగులు వరద పారించిన కంగారూలు.. తరువాత శ్రీలంకను బెంబేలెత్తించారు. కరుణరత్నే(97), కుశాల్ పెరీరా (52) పరుగులు చేయబట్టి సరిపోయింది కానీ, లేకుంటే శ్రీలంక అసలు కనీస పరుగులు కూడా చేయలేకపోయేది. ఔలింగ్ లో కూడా ఆసీస్ అంతలా రాణించింది. మొత్తమ్మీద లంకేయులను చితకబాది.. భారీ తేడాతో విజయాన్ని సొంతం చేసుకుని అదరగొట్టింది ఆస్ట్రేలియా.
ప్రపంచకప్ టోర్నీలో శ్రీలంకతో జరిగిన పోరులో ఆస్ట్రేలియా 87పరుగుల తేడాతో భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 334పరుగులు చేసింది. కెప్టెన్ ఫించ్ (153; 132బంతుల్లో 15×4, 5×6) అద్భుత శతకంతో చెలరేగాడు. స్మిత్(73; 59బంతుల్లో 7×4, 1×6), మాక్స్వెల్(46; 25బంతుల్లో 5×4, 1×6) రాణించారు. లంక బౌలర్లలో ఉడాన, ధనుంజయ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంకను ఆసీస్ బౌలర్లు కట్టడి చేశారు. స్టార్క్(4/55), రిచర్డ్సన్(3/47), కమిన్స్(2/38) ధాటికి లంక 45.5 ఓవర్లలో 247పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు కరుణరత్నె(97; 108బంతుల్లో 9×4), కుశాల్ పెరీరా(52; 36బంతుల్లో 5×4, 1×6) మినహా మిగతా బ్యాట్స్మెన్ వరుసగా పెవిలియన్కు చేరడంతో ఆసీస్ సులభంగా విజయం సాధించింది.