పీఎం కిసాన్‌పై కేంద్రం ఉత్తర్వులు

Update: 2019-06-08 13:51 GMT

ఎన్నికల ప్రచార సమయంలో చేసిన వాగ్దానాలను నిలబెట్టుకునే దిశగా కేంద్రం మరో అడుగు ముందుకేసింది. రైతులందరికీ పీఎం- కిసాన్‌ను అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు ప్రారంభించింది.  రైతులకు నేరుగా నగదు బదిలీ చేసే పథకమైన ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) కింద రైతులందరికీ  రూ.6000 ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు లబ్ధిదారులను గుర్తించాలని కేంద్ర వ్యవసాయ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేసింది.  గతంలో రెండు హెక్టార్ల కంటే తక్కువ వ్యవసాయ భూమి ఉన్నవారికి ఏడాదికి రూ.6000 చొప్పున సాయం అందించారు.  కేంద్రం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల  దేశ వ్యాప్తంగా 14.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. భూమితో సంబంధం లేకుండా ప్రతి రైతుకూ ఆర్థిక సాయం చేసే యోచనతో ఈ పథకాన్ని అభివృద్ధి చేశారు.  నూతన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మే 30న జరిగిన తొలి కేబినెట్‌ సమావేశంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

 అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి పారద్శకంగా వ్యవహరించి సరైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని, పథకం ఫలాలు  వందశాతం సద్వినియోగం అవ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఈ పథకంలో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3.66 కోట్ల మంది లబ్ధిదారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 3.03 కోట్ల మందికి తొలి విడతగా రూ.2000 ఆయా బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. మరో 2 కోట్ల మందికి రెండో విడత నగదు కూడా జమైంది.

అయితే ఈ పథకం పరిధిలోకి రాకుండా కొందరిని మినహాయించారు.  తమ భూములను కార్యాలయాల కోసం అప్పగించిన వారు,  రాజ్యాంగ పరమైన పోస్టుల్లో కొనసాగుతున్నవారు ఈ పథకం పరిధిలోకి  రారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న,  పదవీవిరమణ పొందిన అధికారులను సైతం తప్పించారు.  అంతేకాకుండా  రూ. 10 వేల కంటే ఎక్కువ పింఛన్‌ తీసుకున్న వారితోపాటు ఆదాయపు పన్ను కడుతున్నవారిని కూడా ఈ పథకం నుంచి మినహాయించారు.  ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పీఎం-కిసాన్‌ పథకానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో మరిన్ని నిధులు వెచ్చించాల్సి ఉంది.

Tags:    

Similar News