మొన్న బడ్జెట్ లో పాన్ కార్డ్ లేనివాళ్లు ఆధార్ తో తమ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్కోవచ్చని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో.. పాన్ కార్డ్ ఇక అవసరం లేదేమో.. ఇక దానితో పనిలేదేమో అని చాలా మంది భావిస్తున్నారు. కానీ, పాన్ కార్డ్ ఉంటుంది. కేవలం టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు వస్తున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ఆధార్ నెంబరు తో కూడా రిటర్న్స్ వేయవచ్చనే వెసులుబాటు కల్పించారంతే. ఈ విషయాన్ని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ తెలిపారు. ''పాన్ కార్డు లేకుండా కేవలం ఆధార్ కార్డుతో రిటర్నులు దాఖలు చేసే వారికి నేరుగా కొత్త పాన్ కార్డును అందించాలనుకుటున్నాం. ఇందుకు సంబంధించిన అధికారి.. పన్ను చెల్లింపుదారుడికి స్వయంగా పాన్ కార్డును ఇచ్చే అధికారాన్ని చట్టం ఇస్తోంది'' అని ఆయన చెప్పారు. అంటే, పాన్ కార్డ్ లేకపోవడంతో ఆధార్ తో రిటర్న్స్ ఫైల్ చేసిన వారు దరఖాస్తు చేసినా, చేయకపోయినా పాన్ కార్డ్ జరీ చేసి అందచేస్తారన్న మాట.
''ఈ విషయాన్ని ఇలా అర్థం చేసుకోవడం సరికాదు. పాన్ కచ్చితంగా మరుగున పడలేదు. అది మనుగడలోనే ఉంటుంది. ఆదాయ పన్ను రిటర్నుల ఫైలింగ్ వేసేవారికి ఇది ప్రభుత్వం కల్పిస్తున్న అదనపు సౌకర్యం మాత్రమే. పాన్ లేకపోతే.. రిటర్నుల ఫైలింగ్ ప్రక్రియలో వారు ఇబ్బందులు ఎదుర్కోకుండా దానికి బదులుగా అవసరమున్న చోట ఆధార్ నంబర్ను పొందుపర్చే సౌకర్యాన్ని కల్పిస్తోంది'' అని వ్యాఖ్యానించారు. ఆధార్ కార్డు, పాన్ కార్డులను అనుసంధానం చేయడం ఇప్పుడు తప్పనిసరి అని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశంలో 120 కోట్ల మంది ఆధార్ను, 41 కోట్ల మంది పాన్ను కలిగి ఉన్నారు. 22 కోట్ల పాన్ కార్డులు... ఆధార్ కార్డులతో అనుసంధానం అయ్యాయి. సో.. పాన్ కార్డ్ లేనివాళ్లు లేకపోయినా ఫర్వాలేదులే అనుకోకుండా తప్పకుండా పాన్ కార్డు తీసుకోవాల్సిందే.