భారత దేశంలో ఎవరూ మూడో బిడ్డను కనకుండా చూడాలని రామ్ దేవ్ బాబా సూచిస్తున్నారు. ఆదివారం అయన విలేకరులతో మాట్లాడుతూ మూడో బిడ్డను ఎవరైనా కంటే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పారు. భారత జనాభా మరో 50 ఏళ్ల పాటు 150 కోట్లకు మించకూడదు. అంతకు మించి జనాభాకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి మనం సిద్ధంగా లేము. దంపతులు ఇద్దరు పిల్లలకు మించి కనకుండా ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలి. ఒక వేళ వారు మూడో బిడ్డను కంటే.. ఆ బిడ్డను ఓటు హక్కుకు దూరం చేసేలా చట్టం రూపొందించాలి. అలాగే, అతడు/ఆమె ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలి. ఎటువంటి ప్రభుత్వ పథకాల లబ్ధి పొందకుండా చర్యలు తీసుకోవాలి అని వ్యాఖ్యానించారు. ఏ మతానికి చెందిన వారైనా సరే అధిక సంతానాన్ని కనకూడదని ఆయన సూచించారు.
అదేవిధంగా, దేశంలో మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని రాం దేవ్ బాబా చెప్పారు. ఇస్లామిక్ దేశాల్లోనూ మద్యంపై నిషేధం ఉంది. అలాంటప్పుడు మరి భారత్లో ఎందుకు నిషేధం ఉండకూడదు. మన దేశం రుషులకు జన్మస్థలం. భారత్లో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించాలి. అలాగే, మన దేశంలో గోవధలపై పూర్తిగా నిషేధం విధించాలి. అలాంటప్పుడే ఆవుల అక్రమ రవాణాదార్లు, గోరక్షకులకు మధ్య జరుగుతున్న ఘర్షణలు ఆగిపోతాయి అని రామ్దేవ్ బాబా వ్యాఖ్యానించారు.