దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు తమ పౌరులకు మరిన్ని వెసులుబాట్లు కల్పించాయి. లాక్డౌన్ నుంచి మరికొన్ని సడలింపులు ఇచ్చాయి. ఆర్ధిక వ్యవస్థ పుంజుకోడానికి అనుకూలంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.
కొన్ని సడలింపులు ఇస్తూ లాక్డౌన్ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కేంద్రం గైడ్లైన్స్ పాటిస్తూనే కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరిన్ని వెసులుబాట్లు కల్పించారు. ఢిల్లీ ప్రభుత్వం కార్లు,క్యాబ్లకు అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో గరిష్టంగా ఇద్దరు మాత్రమే ప్రయాణించేలా నిబంధన విధించింది. ప్రైవేటు కార్యాలయాల్లో పూర్తి సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఆఫీసుల్లో ఎక్కువ మంది సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వడానికి ప్రయత్నించాలని కంపెనీలకు సూచించారు. సరి బేరి విధానంలో మార్కెట్లు తెరుచుకోవచ్చిన కేజ్రీవాల్ వివరించారు. భవన నిర్మాణ పనులను ప్రారంభించవచ్చని ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నకార్మికులను మాత్రమే పనిలోకి తీసుకోవాలని కేజ్రీవాల్ తేల్చి చెప్పారు.
లాక్డౌన్పై పశ్చిమబెంగాల్ ప్రభుత్వ నిర్ణయం చర్చనీయంగా మారింది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రాత్రిపూట కర్ఫ్యూ విధించబోమని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఇప్పటికే ప్రజలు ఒత్తిడికి గురవుతున్నారని వారిని మరింత బాధపెట్టే నిర్ణయాలు తీసుకోమని మమతా వివరించారు. మమత బెనర్జీ చేసిన ఈ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఇక కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో బిగ్ స్టోర్స్ తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది బెంగాల్ ప్రభుత్వం. ఈనెల 27 నుంచి ఆటో రిక్షాలు, సెలూన్లు తెరుచుకునేందుకు అనుమతిచ్చింది.
కేరళ ప్రభుత్వం కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ పద్దతిలో దుకాణాలు తెరుచుకోవచ్చని సీఎం పినరయి విజయన్ తెలిపారు. సెలూన్లు ఏసీ లేకుండా నిర్వహించుకోవచ్చని అన్నారు. మద్యాన్ని ఆన్లైన్లో అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని..ఆన్లైన్ వ్యవస్థ సిద్ధమయ్యాక మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇస్తామని విజయన్ వివరించారు. క్లబ్బుల్లో ఆహారాన్ని మద్యాన్ని పార్శిల్ రూపంలో అమ్మవచ్చని సీఎం విజయన్ తెలిపారు.