భారత్ పంటలపై పాక్ మిడతల దాడి
మొదటి నుంచి భారత దేశానికి, దాయాదిదేశమైన పాకిస్తాన్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే చాలు భగ్గు మంటుంది.
మొదటి నుంచి భారత దేశానికి, దాయాదిదేశమైన పాకిస్తాన్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే చాలు భగ్గు మంటుంది. ఎప్పటికప్పుడు పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించి దేశంలో అలజడులను సృష్టిస్తూనే ఉంటారు. సందు దొరికితే చాలు దాడులకు పాల్పడుతూనే ఉంటారు. ఇప్పుడు అదే తరహాలో ఉగ్రవాదులతో పాటు మిడతలు కూడా సరిహద్దుల్లోని భూభాగంలోకి దండెత్తి వస్తున్నాయి. భారతీయులు పండించుకునే పంటలను నామరూపాలు లేకుండా నాశనం చేస్తున్నాయి. అది చూసిన రైతులు తమ పంట తమకు కాకుండా పోతుందని లబోదిబో మంటున్నారు.
ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకెళితే కొద్ది రోజులుగా గుంపులు గుంపులుగా పాక్ నుంచి భారత్ లోని గుజరాత్ లోని బనస్కాంత, మెహసనా, కచ్, పఠాన్, సాబర్కాంత జిల్లాల్లకు దండెత్తి వస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో రైతులు పండించే ఆవాలు, జీలకర్ర, ఆముదం, బంగాళ దుంపలు, గోధుమ, పత్తి, జట్రోఫా లాంటి పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో అక్కడి రైతులు తీవ్ర ఆందోళనకు గురువుతున్నారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మిడతలను అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఫలించకపోవడంతో కేంద్రం ప్రభుత్వం రంగంలోకి దిగింది. మొత్తం 11 బృందాలను గుజరాత్కు తరలించింది.
ఇదిలా ఉంటే గుజరాత్ లోని ఒక్క బనస్కాంత జిల్లాలోనే 5 వేల హెక్టార్లలో పంటను మిడతలు నాశనం చేసాయి. దీంతో అక్కడికి తరలివచ్చిన బృందాలు సీనియర్ అధికారుల సలహాలతో డ్రోన్ల సాయంతో క్రిమిసంహారక మందులను చల్లడం, పొలాల్లో టైర్లను మండించడం, డప్పులు మోగించడం, పొలాల వద్ద టేబుల్ ఫ్యాన్లు పెట్టడం, లౌడ్ స్పీకర్లతో సంగీతాన్ని వినిపించడం చేస్తున్నారు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా వీటితో ఇప్పటి వరకూ పెద్దగా ఫలితం దక్కలేదు.
కాగా ఈ అంశంపై స్పందించిన గుజరాత్ సీఎం విజయ్ రూపానీ మాట్లాడుతూ 1,815 హెక్టార్లలో క్రిమిసంహారక మందులను బనస్కాంత జిల్లాలో చల్లించినట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ కొన్ని ప్రయోగాలతో 25 శాతం వరకు మిడతలను నిర్మూలించామని తెలిపారు. మరో నాలుగు రోజుల్లో మిడతలను పూర్తిగా తొలగిస్తామని తెలిపారు. మిడతల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని తెలిపారు.