మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సిఫారసు చేశారు. దీనికి సంబంధించి ఓ లేఖను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు పంపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టకపోవడంతో ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్రంలో పొలిటికల్ డ్రామా నడుస్తోంది. తొలుత శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని బీజేపీ ప్రకటించినా ఆ పార్టీ మద్దతు కూడగట్టడంలో విఫలం కావడంతో వెనక్కు తగ్గింది. ఇక ఎలాగైనా సీఎం పీఠంపై కూర్చుంటామని ఆది నుంచి చెప్పుకొచ్చిన శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు.
ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్న శివసేన చివరినిమిషంలో బోల్తా పడింది. కాంగ్రెస్ మద్దతుపై సస్పెన్స్ కొనసాగడంతో మరింత సమయం కావాలని కోరింది. మరింత సమయం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పిన గవర్నర్ కోశ్యారి మూడో అతి పెద్ద పార్టీగా అవతరించిన ఎన్సీపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానించారు. ఈ రాత్రి 8 గంటలా 30 నిమిషాల వరకు సమయం ఇచ్చారు. అయితే ఎన్సీపీ కూడా కాంగ్రెస్ మద్దతు కూడగట్టడంపై తర్జనభర్జన పడుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం ఎవరికి మద్దతివ్వాలనే దానిపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. దీంతో ముందుగానే మేల్కొన్న గవర్నర్ కోశ్యారీ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు.