జాతిపిత మహాత్మాగాంధీని ఉద్దేశించి బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలతో లోక్సభలో తీవ్ర దుమారం చెలరేగింది. హెగ్డే వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగొయి, కె. సురేశ్, అబ్దుల్ ఖలీక్ వాయిదా తీర్మానం ఇచ్చారు. అనంతరం సభ ప్రారంభమైన తర్వాత బీజేపీ ఎంపీ క్షమాపణలు చెప్పాలంటూ ప్రతిపక్ష నేతలు ఆందోళనకు దిగారు. మహాత్మా గాంధీని బీజేపీ నేతలు దూషిస్తున్నారన్నారు. బీజేపీ వాళ్లంతా రావణాసురుడి పిల్లలు అని కాంగ్రెస్ ఎంపీ అధిర్ ఆరోపించారు.
రాముడుని సేవించిన పూజారిని అవమానిస్తున్నారని ఆయన విమర్శించారు. అధిర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేతలంతా నిజమైన రామభక్తులు అని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మహాత్మా గాంధీ నిజమైన ఫాలోవర్లమన్నారు. కాంగ్రెస్ వాళ్లు అంతా నకిలీ గాంధీలు అని, సోనియా, రాహుల్ లాంటి నకిలీ గాంధీలను వాళ్లు ఫాలోఅవుతున్నారని ఆరోపించారు. అటు రాజ్యసభలోనూ గందరగోళ వాతావరణం నెలకొంది. ఢిల్లీలో ఇటీవల చోటుచేసుకున్న కాల్పుల ఘటనలపై ప్రతిపక్షాలు నిరసన చేపట్టాయి. గోలీ చలానా బంద్ కరో అంటూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు.