గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిషా, చత్తీస్గఢ్ రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వరదల కారణంగా కేరళలో 25 మంది మరణించారు. మహారాష్ట్రలో 21 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో వరదల కారణంగా 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఒడిశాలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కలహండి ప్రాంతంలో వరదలు పోటెత్తుతున్నాయి. ఇంద్రావతి డ్యాం రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఒడిశాలోని 6 జిల్లాల్లో 100 మిల్లీమీటర్ల మేర వర్షపాతం రికార్డ్ అయింది
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కేరళ అతలాకుతలం అవుతోంది. భారీ వరదల కారణంగా 25 మంది మృతి చెందారు.నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఇడుక్కి, మలప్పురం, కోలికోడ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వర్ష ప్రభావంతో విద్యాసంస్థలకు పినరయి విజయన్ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
మహారాష్ట్రను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదల కారణంగా ఇప్పటికే 2లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. దాదాపు 21 మంది మృత్యువాతపడ్డారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పలు గ్రామాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తోంది. మోకాళ్లలోతుకు పైగా వరద నీరు కూరుకుపోయిన ప్రాంతాల్లోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.