జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ జెఎన్యూలో ఆ ఆదివారం నాటి సాయంత్రం ఏం జరిగింది..? ముసుగు దొంగలు ఎవరు..? 60 మందికి పైగా ముసుగులు వేసుకుని వచ్చినా.. అక్కడి భద్రతా సిబ్బంది, పహారా కాస్తున్న పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు..? ఆనాడు ఏదో జరుగుతుందని వారికి ముందే తెలుసా..? ముసుగు దొంగలకు వారు సహకరించారా..? ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ ను చూస్తే.. ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు వెలుగులోకొస్తున్నాయి.
జేఎన్యూ క్యాంపస్లోని హాస్టళ్లపై ఆదివారం దుండగులు జరిపిన దాడి పోలీసుల సమక్షంలోనే జరిగిందని, అయినా దాన్ని ఆపేందుకు ఢిల్లీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ దాడిపై దాఖలైన ఎఫ్ఐఆర్ను చూస్తే అర్థమవుతుందని చెబుతున్నారు. అంతమంది ముసుగులు వేసుకుని హాస్టళ్లలోకి చొరబడితే వారిలో ఒక్కరిని కూడా పట్టుకునేందుకు ప్రయత్నించక పోవడమే కాదు గుర్తుతెలియని వ్యక్తుల పేరుతో ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
క్యాంపస్లోని పెరియార్ హాస్టల్ దగ్గర కొందరు విద్యార్థులు గుమిగూడి ఇతరులను కొడుతున్నారని, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఎఫ్ఐఆర్ లో నమోదుచేశారు. ఆదివారం సాయంత్రం 3 గంటలా 45 గంటల ప్రాంతంలో క్యాంపస్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ దగ్గరున్న ఎస్సైకి సమాచారం అందిందని అక్కడివారు మిగతా పోలీసులు పెరియార్ హాస్టల్ దగ్గరకు వెళ్లడంతో ముసుగులు ధరించి కర్రలతో విద్యార్థులను కొడుతూ కనిపించారని పోలీసులను చూడగానే వారు అక్కడి నుంచి పారిపోయారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
అలాగే సాయంత్రం 7 గంటలకు సబర్మతి హాస్టల్లోకి కొంతమంది దుండగులు ప్రవేశించి కొడుతున్నారని పోలీసు ఇన్స్పెక్టర్కు సమాచారం అందిందని ఆయన వెంటనే ఫిర్యాదు చేసిన పోలీసు అధికారిని, తన సిబ్బందిని తీసుకొని సబర్మతి హాస్టల్కు వెళ్లగా అక్కడ ముసుగులు ధరించి వ్యక్తులు కర్రలతో విద్యార్థులను బాదడం కనిపించిందని పేర్కొన్నారు. వారిని మైకులో హెచ్చరించడంతో పరారయ్యారని తెలిపారు. అదే సమయంలో క్యాంపస్లో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిందిగా క్యాంపస్ అధికారుల నుంచి విజ్ఞప్తి అందడంతో అదనపు బలగాలు మోహరించారు. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.
అయితే గత కొంతకాలంగా జేఎన్యూ క్యాంపస్ ఆవరణలో పోలీసు పికెట్ ఉంటోంది. మరి ఆదివారం అంతమంది ముసుగులు ధరించిన దుండగులను చూసి పోలీసులు ఎందుకు స్పందించలేదు..? సాయంత్రం మళ్లీ కనిపించినప్పుడు వారిలో ఒక్కరిని కూడా పట్టుకునేందుకు ఎందుకు ప్రయత్నించలేదు..? మొదట్లోనే అదనపు బలగాల కోసం ఎందుకు కోరలేదు..? మధ్యాహ్నం 3.45 గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు స్వైర విహారం చేసినా క్యాంపస్ అధికారులు ఎందుకు సకాలంలో స్పందించలేదు..? అసులు దాడి జరిగినప్పుడు క్యాంపస్లో ఎంత మంది పోలీసులు ఉన్నారు..? అదనపు బలగాల్లో ఎంత మంది, ఎప్పుడు వచ్చారు..? ఇవన్నీ సమాధానంలేని ప్రశ్నలుగా మిగిలాయి.