భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాల్లో వరద విలయం సృష్టిస్తోంది. పలు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, అసోం, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుజరాత్లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ చిన్నపాటి చెరువులయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో బుధవారం కురిసిన భారీవర్షాలతో వడోదర విమానాశ్రయాన్ని మూసివేశారు. వడోదర నగరంలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వడోదర మీదుగా దేశంలోని పలు ప్రాంతాలకు రాకపోకలు సాగించాల్సిన పలు రైళ్లను రద్దు చేశారు. వడోదరలో గుజరాత్ రాష్ట్రంలోనే అత్యధికంగా రికార్డు స్థాయిలో 442 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
మరోవైపు అసోంలో కూడా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రఖ్యాత ఖజిరంగా జాతీయ పార్క్లో జంతువులు కష్టాలు పడాల్సి వస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోవడంతో మూగజీవాలు ఎటు వెళ్లాలో తెలియక చిక్కుకుపోయాయి. ఖడ్గమృగాలు సైతం వరద నీటి ఉధృతికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
ఇటు బిహార్లో భారీ వర్షాలు పలు గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలతో పాటు నదీ తీర ప్రాంతాలపై వరద నీరు ఉప్పొంగింది. ఇళ్లు, గుడిసెలు నీటిలో మునిగిపోయాయి. దీంతో స్థానిక ప్రజలు కష్టాలు పడుతున్నారు. తమను ఆదుకోవాలని అధికారులను వేడుకుంటున్నారు.
ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ షిమ్లాలో కూడా రోజంతా చిరుజల్లులు పడుతున్నాయి. పొగమంచు కూడా తోడవడంతో అందాలు రెట్టింపయ్యాయి. ప్రకృతి సోయగాలతో షిమ్లా అద్భుతంగా కనిపిస్తోంది.