ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపుతున్న రఫేల్ ఒప్పందంపై కాగ్ నివేదికను ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్ ముందుంచనుంది. సాధారణంగా కాగ్ నివేదిక సమర్పణ అనంతరం ఓ ప్రతిని రాష్ట్రపతికి, మరో ప్రతిని ఆర్థిక శాఖకు పంపిస్తారు. పార్లమెంటులో దాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆ అంశంపై జరుగుతున్న రాజకీయ రాదంతం నేపథ్యంలో కాగ్ రిపోర్ట్ ను పార్లమెంటులో పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఫ్రాన్స్ కంపెనీ దాసాల్ట్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం పాలక, విపక్షాల మధ్య పరస్పర ఆరోపణలకు కేంద్ర బిందువైన సంగతి తెలిసిందే.
ప్రస్తుత లోక్సభ సమావేశాలు బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో ఒక్కరోజు ముందు రఫేల్పై కాగ్ నివేదికను ప్రభుత్వం పార్లమెంట్లో సమర్పించనుంది. ఆర్థిక కార్యదర్శిగా గతంలో మహర్షి ఆధ్వర్యంలోనే రఫేల్ ఒప్పందం కుదిరినట్లు స్పష్టమవుతోందన్నారు కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్. ప్రస్తుతం ఆయన కాగ్గా ఉండటంతో ఈ వ్యవహారంలో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నట్లేనని ఆయన అంటున్నారు.ఇక కొంతమంది అధికారులు ప్రధాని మోడీ పట్ల అతి విధేయత ప్రదర్శిస్తున్నారని సిబల్ ఆరోపించారు. కాగా కపిల్ సిబల్ ఆరోపణలను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. వ్యవస్ధలను నీరుగార్చే ఇలాంటి విమర్శలు చేయడం తగదని ఆయన హితవు పలికారు.