పక్కా ప్లానింగ్.... ఊహకందని వ్యూహం... ప్రతిపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా జమ్మూకాశ్మీర్పై కీలక ప్రకటన చేసింది కేంద్రం. మంచుకొండల్లో ఏదో జరగబోతుందని ఉత్కంఠగా ఎదురు చూస్తే... మోడీ సర్కార్ నయా కాశ్మీర్ను ఆవిష్కరించింది. జమ్మూకాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి హోదాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఆర్టికల్ 370, 35ఏను రద్దు చేస్తూ తీర్మానం చేసింది. దీనిపై రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్షా కీలక ప్రకటన చేశారు.
ఇక దీనిపై కాంగ్రెస్ పక్ష నేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా.. మోదీ సర్కార్ భారత రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందని అన్నారు. మోడీ ప్రభుత్వం తీరుతో కశ్మీర్ మరో 70 ఏళ్లు వెనక్కి వెళ్లే అవకాశం వుందని ఆజాద్ హెచ్చరించారు. కేంద్రం నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజని అన్నారు. జమ్మూ కాశ్మీర్ లోని పీడీపీ సహా కాంగ్రెస్ తో పాటు ఎన్నో పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. భయాందోళనలు రేకెత్తించి కశ్మీర్ను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. దేశ రాజ్యాంగానికి తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏయే పార్టీలు వ్యతిరేకిస్తాయి..? ఏయే పార్టీలు స్వాగతిస్తాయి అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.