Coronavirus: తమిళ నాడులో తొలి మరణం.. దేశవ్యాప్తంగా పెరిగిన కరోనా బాధితులు
కరోనా బారిన పడి తొలిసారిగా తమిళనాడులో ఒకరు మృతి చెందారు. ఈ మరణంతో భారత్ లో కరోనా మరణాల సంఖ్య 11కు చేరింది. తమిళనాడులో ఇప్పటివరకూ 18 మంది బాధితులను గుర్తించగా ఇది తోలి మరణం. తమిళనాడుకు చెందిన ఓ 54 సంవత్సరాల వ్యక్తి కరోనా వ్యాధి లక్షణాలతో మధురైలోని రాజాజీ ఆస్పత్రిలో చేరాడు. వైద్య పరీక్షలలో కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స ప్రారంభించారు. కానీ, అప్పటికే ఆయన 'అన్కంట్రోల్డ్ డయాబెటిస్', సీఓపీడీ, హైపర్టెన్షన్ వంటి సమస్యలతో బాధపడుతుండడంతో రోగనిరోధక శక్తి పూర్తిగా క్షీణించింది. దీంతో ఆరోగ్యం మరింత క్షీణించి బుధవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ ధ్రువీకరించారు.
ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 519 కి చేరుకుంది.
కరోనా వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో భారత ప్రభుత్వం ప్రత్యెక చర్యలు తీసుకుంది. 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రధాని మోడీ నిన్న రాత్రి ప్రకటించారు. మొత్తం దేశం స్తంభించిపోయింది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు.