ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నేతల మధ్య ఘర్షణ.. ఆప్ కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన కాంగ్రెస్ నేత !
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, అప్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఆప్ కార్యకర్త చెంప చెళ్లుమనిపించింది కాంగ్రెస్ నేత ఆల్కాలాంబ. ఇరువర్గాలు బూతులు తిట్టుకున్నారు. అప్కార్యకర్తల అభ్యంతరకర వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఊగిపోయారు. చాందినీచౌక్ 126 పోలింగ్ బూత్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘర్షణ పడుతున్న ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. కాంగ్రెస్, అప్ నేతల మధ్య నెలకొన్న గొడవ హాట్ టాపిక్గా మారింది. మరోవైపు ఈ గొడవపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని అప్ నేతలు చెబుతున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ సాయంత్రం 6 గంటల ముగుస్తుంది. మొత్తం 60వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఢిల్లీలో మొత్తం 70 స్థానాలకు ఎన్నికల బరిలో మొత్తం 672 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కోటి 47లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా మొత్తం 13,750 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. వీటిలో 3,141 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించిన పోలీసులు ఆయా కేంద్రాలపై ప్రత్యేక నిఘాపెట్టారు.
మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 58 జనరల్, 12 ఎస్సీ అభ్యర్థులకు కేటాయించారు. ఇక సీఎం కేజ్రీవాల్ పోటిచేస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానానికి 26 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఈ నెల 11న ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.