ఈ సంవత్సరం 7 శాతం వృద్ధి తప్పనిసరిగా సాధిస్తామని ఆర్ధిక సర్వేలో పేర్కొన్నారు. బడ్జెట్ ముందు ప్రవేశ పెట్టె ఆర్ధిక సర్వ్ వివరాలను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. 2018 - 2019 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు గణనీయంగా పెరగనున్నట్టు ఆ సర్వేలో పేర్కొన్నారు. ముఖ్య ఆర్ధిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్ ఈ సర్వే వివరాలను తయారు చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొని వున్నఆర్ధిక పరిస్థితులను చెబుతూనే.. మన ఆర్ధిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ళను ఈ సర్వ్ ప్రస్తావించింది.
ఆర్థిక సర్వేలోని కీలక అంశాలు ఇవే
⊗ 2020 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 7శాతం ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.
⊗ డిమాండ్, రుణ లభ్యత పెరగడంతో 2020లో పెట్టుబడుల వృద్ధి రేటు కూడా పెరిగే అవకాశం ఉంది.
⊗ వ్యయాలు పెరగడం, ప్రైవేటు పెట్టుబడుల్లో వృద్ధి కారణంగా 2019-20లో జీడీపీ వేగంగా పెరుగుతుంది.
⊗ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మందగమనం, వాణిజ్య ఘర్షణలు పెరగడం ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
⊗ భారత్ 2025నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే మాత్రం వృద్ధి రేటు ఇప్పటి నుంచే 8శాతం దాటాలి.
⊗ చమురు ధరలు అందుబాటులో ఉండటం వల్ల వినిమయ శక్తి పెరగవచ్చు. ఈ ఏడాది చమురు ధరలు తగ్గవచ్చు.
⊗ పెట్టుబడుల రేటు 2011-12 నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2019-20 నుంచి మళ్లీ పెట్టుబడుల రేటు పెరిగే అవకాశం ఉంది.
⊗ గ్రామీణ ప్రాంతాల్లో వేతనాల్లో వృద్ధి కనిపించే అవకాశం ఉంది. 2018 వరకు వీటిలో వృద్ధి నిలిచిపోయింది. ఆ తర్వాత నుంచి పెరుగుదల కనిపిస్తోంది.
⊗ వృద్ధిరేటులో మందగమనం, జీఎస్టీ, వ్యవసాయ పథకాల ఒత్తిడి ఆర్థిక వ్యవస్థపై ఉంటుంది.
⊗ దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడటం పెట్టుబడుల వాతావరణాన్ని పెంచుతుంది.
⊗ ఎఫ్డీఐల నియంత్రణ తగ్గించేలా ప్రభుత్వ పాలసీలు ఉండే అవకాశం ఉంది.
⊗ ఈ ఏడాది ద్రవ్యలోటు తగ్గి 5.8శాతం ఉండొచ్చు. అదే 2018లో 6.4శాతంగా ఉంది.
⊗ మొండిబాకాయిలు తగ్గుముఖం పట్టడం.. మూలధన వ్యయాల పెంపునకు సహకరించవచ్చు.