విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా.. సాంకేతిక అంశాలు ముఖ్యమా : హై కోర్టు
తెలంగాణ హైకోర్టు వేదికగా పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది.
తెలంగాణ హైకోర్టు వేదికగా పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తన్న నేపథ్యంలో బాలకృష్ణ, సాయిమణి వరుణ్లు వేర్వేరుగా పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని దాఖలు చేసిన వ్యాజ్యాలపై శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధర్మాసనం విచారన జరిపింది. ఈ సందర్భంగా న్యాయస్థానం జీహెచ్ఎంసీ, రంగారెడ్డిలో కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పరీక్షలు నిర్వహంచడం సాధ్యమవుతుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో పిటిషనర్ తెలంగాణ విద్యార్ధులకు కూడా పంజాబ్ తరహాలో పరీక్షలు నిర్వహించకుండానే గ్రేడింగ్ ఇవ్వాలని వాదించారు. ఈ వాజ్యంపై స్పందించిన న్యాయస్థానం అసలు విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించకుండా గ్రేడింగ్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఒక వేల అలాంటి అవకాశం ఏమైనా ఉంటే వెంటనే తమకు తెలియజేయాలని కోరింది. పరీక్షలు లేకుండా గ్రేడింగ్ ఇస్తే ఇబ్బందేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాగా హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రశ్నలకు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ స్పందిస్తూ ప్రశ్నపత్రం మళ్లీ మళ్లీ తయారుచేయడం ఇబ్బంది అవుతుందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అందుకే వేర్వేరుగా పరీక్షలను నిర్వహించడం కష్టమని తెలిపారు. ఏజీ వాదనలు విన్న హైకోర్టు ఘటుగా స్పందించింది. ప్రభుత్వానికి సాంకేతిక అంశాలు ముఖ్యమా లేక విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా ప్రశ్నించింది. ఈ ప్రశ్నలకు స్పందించిన ఏజీ పూర్తివివరాలను ప్రభుత్వాన్ని అడిగి తెలియజేస్తానని సమాధానమిచ్చారు.