CM Jagan: ప్రభుత్వ వ్యూహాల వల్ల రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద ఘటనలు తగ్గాయి
CM Jagan: తీవ్రవాద సమస్యను ఎదుర్కోవడానికి అన్ని చర్యలు తీసుకున్నాం
CM Jagan: ప్రభుత్వ వ్యూహాల వల్ల రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద ఘటనలు తగ్గాయి
CM Jagan: ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో సీఎం జగన్ పాల్గొన్నారు. గడిచిన 4 దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాద సమస్యపై ఏపీ రాష్ట్రం పోరాడుతోందన్నారు. ఈ ప్రాంతాల్లో జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళిక ప్రకారం.. తీసుకున్న చర్యలు, అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, స్ధానిక ప్రజల హక్కుల పరిరక్షణ వంటి బహుముఖ విధానం.. సానుకూల ఫలితాలను అందించిందన్నారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ మద్దతుతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోందని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం అనుసరించిన వ్యూహాల వల్ల రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద హింసాత్మక సంఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయన్నారు. మొదట్లో ఆంధ్రప్రదేశ్లోని 5 జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టు కార్యకలాపాలు.. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయన్నారు. ప్రభుత్వం తీసుకున్న చురుకైన చర్యల కారణంగా.. మావోయిస్టు తీవ్రవాదబలం 2019 నుంచి 2023 నాటికి 150 శాతం నుంచి 50 శాతానికి తగ్గిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన సరిహద్దులను ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గఢ్లతో పంచుకుంటోందని, పొరుగు రాష్ట్రాలతో పటిష్టమైన సమన్వయం ఉందని చెప్పారు. ఈ నాలుగు రాష్ట్రాల అధికారులతో కూడిన జాయింట్ టాస్క్ఫోర్స్లు.. ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగిందని.. వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడానికి తమకున్న సమాచారాలను ఈ ఉమ్మడి టాస్క్ఫోర్స్ ద్వారా పరస్పరం పంచుకుంటూ.. సమిష్టిగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు.