ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన తుది కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ రానున్న నేపథ్యంలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని అనధికార కాలనీల్లో స్ధానికులకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు ఓ కమిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో చెరుకు రైతులను ఆదుకునేందుకు షుగర్ మిల్లులకు రూ 2790 కోట్ల అదనపు నిధుల కేటాయింపును కేబినెట్ ఆమోదించింది. అలాగే థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను చక్కదిద్దేందుకు మంత్రుల బృందంచేసిన సిఫార్సులకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. ఉన్నత విద్యాసంస్ధల్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి కేంద్ర విద్యా సంస్థల ఆర్డినెన్స్ 2019కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.