కరోనా ఎఫెక్ట్ : భక్తులెవరూ శబరిమలకి రావొద్దు
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న నేపధ్యంలో ఈ నెల ముగిసేవరకు భక్తులు ఎవరు శబరిమల ఆలయానికి రావొద్దని దేవస్థానం బోర్డు వెల్లడించింది.
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న నేపధ్యంలో ఈ నెల ముగిసేవరకు భక్తులు ఎవరు శబరిమల ఆలయానికి రావొద్దని దేవస్థానం బోర్డు వెల్లడించింది. కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ బోర్డు ప్రెసిడెంట్ ఎన్.వాసు చెప్పారు.
ఇక ఎప్పటిలాగే స్వామివారికి పూజా కార్యక్రమాలు యథావిధిగా జరగుతాయని అయన స్పష్టం చేశారు.. అయితే ఎవరైనా తెలియక వస్తే మాత్రం వారిని అడ్డుకోమని వెల్లడించారు. కరోనా విజృంభణతో కేరళలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత రెండు రోజులుగా అక్కడ 6 కేసులు బయటపడగా.. ఈ రోజు ఒక్కరోజే మరో ఆరు కేసులు వెలుగుచూశాయి.
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కేరళ ప్రభుత్వం ఈరోజు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నేటి నుంచి మార్చి ఆఖరు వరకు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. అయితే, ఏడో తరగతి పైబడిన విద్యార్థులకు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు కొనసాగుతాయని సీఎం స్పష్టం చేశారు. అంతేకాకుండా ధియేటర్లను కూడా ముసివేస్తున్నట్టుగా మలయాళీ చిత్ర పరిశ్రమ నిర్ణయం తీసుకుంది.
భారత్లోనూ క్రమంగా :
చైనాలో మొదలైన కరోనా వైరస్(కొవిడ్-19) మెల్లిమెల్లిగా ఇతరదేశాలపై కూడా తన ప్రభావాన్ని చూపుతుంది. ఇక భారత్లోనూ క్రమక్రమంగా విస్తరిస్తోంది. తాజాగా కర్ణాటకలో మూడు, కేరళలో ఆరు కేసులు నమోదు అయ్యాయి. దీనితో సంఖ్య 56కి చేరుకున్నాయి. వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడిస్తున్నారు.