జమ్ము కశ్మీర్ పునర్విభజన బిల్లుపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. ఫెడరలిజానికి అర్ధం లేకుండా పోయిందని మండిపడ్డాయి. కశ్మీర్ ను పాలస్తీనాలా తయారు చేస్తున్నారని అంటూ విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. పునర్విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.దేశంలో ఫెడరలిజానికి అర్థం లేకుండా పోయిందని, భారత్ కూడా చైనాలా మారుతోందని విమర్శించారు. దేశంలో పరిపాలన నాజీలను తలపిస్తోందని, నాజీ సిద్ధాంతాలను బీజేపీ అనుసరిస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ను పాలస్తీనాలా తయారు చేస్తున్నారని అంటూ, ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.
జాతీయ వాదం గురించి కాంగ్రెస్ పార్టీకి పాఠాలు చెప్పాల్సిన పని లేదని ఎంపీ శశిథరూర్ అన్నారు. కాంగ్రెస్ ఎల్లప్పుడు కశ్మీర్ పౌరులకు మద్దతుగా నిలబడుతుందని ప్రకటించారు. కశ్మీరీలు మన తోటి పౌరులని గర్వంగా చెబుతామన్నారు. జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రస్తుతం లోక్సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను నిందించడం సరికాదన్నారు. ఆర్టికల్ 370 రూపకల్పనలో సర్దార్ వల్లభాయ్పటేల్ పాత్ర ఉందని వెల్లడించారు.సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ లోక్సభలో కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పలు ప్రశ్నలు వేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్పై అమిత్ షాను నిలిదీశారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని, కేంద్రం నిబంధనలను విస్మరించిందని పలు పార్టీలు ఆరోపించాయి.