లోక్సభలో జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లును ప్రవేశ పెట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రకటన చేశారు. ఆర్టికల్ 370, 35ఏ రద్దుతో జమ్మూకశ్మీర్కు ప్రయోజనం చేకూరుతుందని, ఆర్టికల్ 370 రద్దు తీర్మానం, జమ్మూకశ్మీర్ విభజన బిల్లుల ఆమోదానికి సభలో సహకరించాలని ఆయన కోరారు. భారతదేశంలో ఉన్న నియమ నిబంధనల్నీ జమ్ముకాశ్మీర్కు వర్తిస్తాయన్నారు. కాశ్మీర్లో తీసుకొస్తున్న మార్పుల్ని ఎవరూ ఆపలేరన్నారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకోవడానికి నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమన్నారు షా. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వ చర్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. జమ్మూకశ్మీర్లో విషయంలో కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పేర్కొనడంతో.. బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభలో కొంత గందరగోళం నెలకొంది.
అయితే రాజ్యసభతో పోల్చుకుంటే ... లోక్సభలో సొంతంగానే 303 మంది సభ్యులు ఉండటం, మిత్రపక్షాలతో పాటు పలువురు తటస్తులు కూడా బిల్లుకు మద్ధతు ఇవ్వడంతో 400 మంది పైగానే మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలోని మొత్తం 25 మంది ఎంపీలు బిల్లుకు మద్దతు ఇవ్వనున్నారు. తెలంగాణలోనూ MIM, కాంగ్రెస్ సభ్యులను మినహాయిస్తే మిగిలిన 13 మంది బిల్లుకు అనుకూలంగానే ఓటు వేయనున్నారు.