పాక్ చెరలో ఇద్దరు భారతీయులు..వీరిలో ఒకరు తెలుగు వ్యక్తి
ఈనెల 14న బహావుల్పూర్లో తెలుగువ్యక్తి ప్రశాంత్ వైందంతో పాటు మధ్యప్రదేశ్కు చెందిన వారిలాల్ను పాక్ పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు.
పాక్ చెరలో ఉన్న ప్రశాంత్ సరిహద్దులు దాటి ఎందుకు వెళ్లాడు...? అతను పాస్ పోర్టు, వీసా లేకుండా పాక్లో ప్రవేశించాడా...? ప్రశాంత్ అరెస్టు భారత్, పాక్ మధ్య మరో దౌత్య పరంగా మరో వివాదంగా మారబోతుందా...?
ఈనెల 14న బహావుల్పూర్లో తెలుగువ్యక్తి ప్రశాంత్ వైందంతో పాటు మధ్యప్రదేశ్కు చెందిన వారిలాల్ను పాక్ పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. పాస్పోర్టు, వీసా లేకుండా చోలిస్తాన్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు. వీరిద్దరిపై పాక్ చట్టంలోని 334-4 కింద అభియోగాలు నమోదు చేశారు. విశాఖ గాజువాకలో ప్రశాంత్ మిస్ అయినట్లుగా పాక్ ఎఫ్.ఐ.ఆర్లో పేర్కొంది.
పాకిస్తాన్లోని న్యాయస్థానం వద్ద అక్కడి మీడియా ప్రతినిధులు ప్రశాంత్ను ఇంటర్వ్యూ చేశారు. తెలుగులో మాట్లాడిన ఆ ఇంటర్వ్యూను పాక్ మీడియా ట్విట్టర్లో పెట్టింది. అరెస్టయిన ఇద్దరిలో ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని... అధునాతన ఉగ్రవాద దాడి చేయడానికి వారిని పాక్ పంపారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటూ అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి.
రాజస్థాన్ థార్ ఎడారిలో ప్రచండ గాలులు వల్ల ఇసుక తిన్నెలు ఒక చోటు నుంచి మరోచోటకు వెళుతుంటాయి. దీంతో భారత్-పాక్ సరిహద్దు వెంబడి ఉన్న కంచె కొన్నిసార్లు కనిపించదని భారత వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ ప్రాంతాన్ని సందర్శిస్తున్న కొందరు పొరపాటున సరిహద్దు దాటి పాక్లోకి వెళ్లిన సందర్భాలు గతంలో ఉన్నాయి. వీరు కూడా ఇలాగే వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. ప్రశాంత్, వారిలాల్ అరెస్టుపై విదేశీ వ్యవహారాల శాఖ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.