మాజీ మంత్రి వివేకానంద రెడ్డి మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయంటున్నారు కుటుంబ సభ్యులు. ప్రజల మనిషిగా ఉన్న వ్యక్తి ఇలా దూరమవుతారని తాము ఊహించలేదంటున్నారు. తన పెదనాన్న మృతిపై అనుమానాలు కలుగుతున్నాయని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరో దాడి చేస్తే చనిపోయినట్లు ఉందని, తలకు ముందువెనుక గాయాలున్నాయని, చేతులకు గాట్లు ఉన్నాయని అవినాష్ రెడ్డి చెప్పారు. ఎవరో దాడి చేస్తేనే వైఎస్ వివేకానందరెడ్డి మరణించినట్లు స్పష్టంగా అర్థమవుతోందని వైఎస్ అవినాశ్ రెడ్డి తెలిపారు. ఆయన మృతిపై ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కుట్రలో ఎంతటి వారున్న కఠినంగా శిక్షించాలన్నారు.