భారత దశదిశను మార్చడానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన నవయువ ఓటర్లు ఉరకలేస్తున్నారు. భారత ఓటర్లలో 50 శాతం కంటే పైబడి నవతరంఓటర్లే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు విశాఖ జిల్లాలో సైతం యువఓటర్ల గణనీయంగా ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ వీరిపైనే దృష్టి కేంద్రీకరించాయి.
నవ్యాంధ్రప్రదేశ్ కు రెండోసారి జరుగుతున్న ఎన్నికల్లో నవతరం ఓటర్లు తమ ఓటు హక్కుతో రాష్ట్రం తలరాతను మార్చడానికి ఉరకలేస్తున్నారు. దేశంలోని మొత్తం ఓటర్లలో 50 శాతం నవతరం ఓటర్లుంటే మన. రాష్ట్రంలో సుమారు 40 శాతం మంది యువ ఓటర్లే ఉన్నారని ఎన్నికల సంఘం తాజాగణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి.ఇక ఉత్తరాంధ్ర ముఖద్వారం, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అడ్డా విశాఖపట్నం జిల్లా ఓటర్లలో సైతం 37.50 శాతం మంది నవతరం ఓటర్లే ఉన్నారు. జిల్లాలోని 15 నియోజకవర్గాలలోని 13 లక్షల 50 వేల ఓట్లే వివిధ పార్టీల జయాపజయాలను నిర్దేశించనున్నాయి.
యువఓటర్లే పలు నియోజకవర్గాల్లో కీలకం కావడంతో వీరిని ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ దృష్టి కేంద్రీకరించాయి. యువఓటర్లలో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారి సంఖ్య లక్షన్నరకుపైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో యువ ఓటర్లే గెలుపు అవకాశాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉండడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. వారంతా ఎవరి వైపు మొగ్గు చూపుతారోనని టీపీడీ, వైసీపీ, జనసేన పార్టీలలో ఆందోళన నెలకొంది.
రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ యువతను ఆకట్టుకునేందుకు హామీలను గుప్పించాయి. అధికార తెలుగుదేశం, ప్రధాన ప్రతిపక్ష వైసీపీతో పాటు జనసేన పార్టీ యువ ఓటర్లపై ప్రత్యేకంగా దృష్టి సారించి వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. అధికారంలోకి వస్తే తామేం చేయబోతున్నదీ ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లగా యువత కూడా వాటిపైన సీరియస్గానే దృష్టి సారించాయి. ఆయా పార్టీలు ఇచ్చిన హామీలు, వాస్తవంలో అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్న యువత ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది.
అధికార టీడీపీ నిరుద్యోగ భృతిని 3వేల రూపాయలకు పెంచుతామని, ఏటా ఉద్యోగాల కేలండర్ ప్రకటించి ప్రభుత్వశాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తామని చెబుతోంది. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ మాత్రం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యతో పాటు 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని, ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఫీజులు ఎంతైనా ప్రభుత్వమే చెల్లిస్తుందంటూ ఊదరగొడుతోంది. ఇక జనసేన మాత్రం ఒకేసారి పరీక్ష ఫీజు చెల్లిస్తామని కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యతో పాటు దేశ భక్తి ప్రాంగణాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తోంది. హామీల సంగతి ఎలా ఉన్నా అత్యంత తెలివిగల నవతరం ఓటర్లను ఏపార్టీ తమ బుట్టలో వేసుకోగలదన్నదే ఇక్కడి అసలు పాయింట్.