సార్వత్రిక ఎన్నికలకు ప్రతిపక్ష వైసీపీ సిద్ధమైంది. మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్ధానాలకు అధినేత వైఎస్ జగన్ అభ్యర్ధులను ఖరారు చేసినట్టు సమాచారం. 2014 ఎన్నికల్లో జరిగిన తప్పదాలు మరోసారి పునరావృతం కాకుండా జగన్ జాగ్రత్తపడుతున్నారు. టీడీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు వైసీపీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. కుదిరితే ఈ రోజు సాయంత్రం లేకపోతే రేపు జాబితాను విడుదల చేసే అవకాశాలున్నాయి. అయితే పలు చోట్ల రేగిన అసంతృప్తజ్వాలలను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు. ప్రస్తుతం పార్టీలో ఉన్న సిట్టింగ్లందరికీ సీట్లు ఖరారు చేసినట్టు సమాచారం.