పెళ్లైన వారంలోనే భర్తని చంపించిన భార్య ..

Update: 2019-05-31 05:11 GMT

అక్రమసంబందం మోజులో కట్టుకునే భర్తను సైతం చంపించేందుకు వెనుకాడడం లేదు కొందరు .. ఇప్పటికి మనం ఇలాంటి సంఘటనలు విన్నాం చూసాం .. జ్యోతి ,స్వాతి ,సరస్వతిలాగే నాగలక్ష్మి కూడా తన భర్తను ప్రియుడు చేతితో చంపించింది .. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది ..

ఇక వివరాల్లోకి వెళ్తే .. తూర్పుగోదావరి జిల్లా కరపకు చెందిన పేకేటి సూర్యనారాయణ(28) ఎంఎస్సీ చదివి మండపేటలోని ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి వేపకాయలపాలెం గ్రామానికి చెందిన నాగలక్ష్మితో మే 15 న వివాహం జరిగింది. మే 21వ తేదీ మధ్యాహ్నం భార్యతో కలిసి అత్తారింటికి వెళ్లిన సూర్యానారాయణ సాయంత్రం వేళ ఓ పని ఉందని బయటకు వెళ్లాడు. రాత్రయినా సూర్యనారాయణ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు కంగారుపడి గ్రామమంతా గాలించినా ఫలితం లేకపోయింది. 22వ తేదీ ఉదయం పెనుగుదురు-పాతర్లగడ్డ మార్గంలో పంట పొలాల వద్ద సూర్యనారాయణ బైక్ కనిపించడంతో సమీపంలో వెతికగా మృతదేహం లభించింది. తల నరికి అత్యంత కిరాతకంగా హత్య చేసి గడ్డి కప్పి ఉంచడంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ పి.ఈశ్వరుడు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. విచారణలో భాగంగా నాగలక్ష్మి అక్రమ సంబంధం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె ప్రియుడు రాధాకృష్ణను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. తమ అక్రమ సంబంధానికి భర్త ఎక్కడ అడ్డొస్తాడోనన్న ఆందోళనతో నాగలక్ష్మి సూచన మేరకే సూర్యనారాయణను హత్య చేసినట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు రాధాకృష్ణతో పాటు నాగలక్ష్మిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.  

Similar News