దేశమంతా కమలం వికాసం ఖాయమంటూ సర్వేలు ఢంకా బజాయిస్తుంటే తెలంగాణలో మాత్రం కమలం కమిలిపోతుందని తేల్చిచెప్పింది. ఎందుకిలా? మిషన్ తెలంగాణ అంటూ కమల దిగ్గజ నేతలు కలవరిస్తుంటే కార్యకర్తలు కలవరపడే పరిస్థితి ఎందుకొచ్చింది? మోడీ, షా ద్వయం దిశా నిర్దేశంతో కూడా మారని పరిస్థితిపై కమలం నేతలు ఏమంటున్నారు?
ఎగ్జిట్పోల్ పల్స్ అంతా ఎన్డీయే కూటమికే పట్టం కట్టాయి. ఒకట్రెండు సర్వే సంస్థలు తప్పిస్తే అన్నీ సంస్థలూ కమలం వికాసం ఖాయమంటూ ఊదరగొట్టేశాయి. ఆ సంతోషం ఆ ఆనందమే తప్పిస్తే తెలంగాణలో కమలం నేతలకు పెద్దగా కలిసివచ్చిదేమీ లేదు.
పార్లమెంటు ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలల్లో తెలంగాణ బీజేపీ పరిస్థితిని యథా స్థానాన్నే కొనసాగించింది. 2014లో ఉన్న ఒక్క స్థానాన్నే కమలం పార్టీ దక్కించుకోవబుతోందని సర్వే సంస్థలు తేల్చిచెప్పేశాయి. కేంద్రలో పార్టీ మరోసారి అధికారం దక్కించుకోవడానికి సిద్ధమవుతున్నా తెలంగాణలో మారని కాషాయ పార్టీ పరిస్థితి పార్టీ అధిష్టానానికి మింగుడు పడటం లేదు.
కర్నాటక తరువాత తెలంగాణలో పార్టీ బలపడే అవకాశముందని పదే పదే పార్టీ దిగ్గజ నేతలు ఊదరగొట్టే ప్రసంగాలు చేసినా ఫలితాలల్లో మాత్రం అది కనిపించలేదు. గత ఆనవాయితినే కొనసాగిస్తూ ఈసారి ఒక్క స్థానానికి కమలం పార్టీ రెడీ అవుతోందని సర్వేలు చెబుతున్నాయి. ఎగ్జిట్పోల్స్కి ముందు కాషాయ పార్టీ తెలంగాణలో పార్లమెంటు ఎన్నిలకల్లో గతం కంటే మెరగైన ఫలితాలు సాధిస్తుందని నాయకులు అంచానా వేసుకున్నారు. సికింద్రాబాద్తో పాటు కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్గిరి, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాలు అదనంగా తమకు రెండు నుంచి మూడు పార్లమెంటు స్థానాలు వస్తాయని చెప్పుకుంటూ వచ్చారు. కానీ తాజ ఎగ్జిట్ పోల్స్లో మాత్రం కమలం పార్టీకి ఒక్కటంటే ఒక్క స్థానమే వచ్చే అవకాశముందని మెజార్టీ సర్వే సంస్థలు చెప్పడంతో నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. బీజేపీ సొంతగా స్థానాలు దక్కించుకోవడం కంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానానికి పరిమితం అవుతుందన్న వార్త కమలం పార్టీని మరింత ఆనందంలోకి నెట్టివేసిన్నట్లు కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ నేతలంగా తమ వైపే చూస్తారని కమలం నేతలు లెక్కలు వేస్తున్నారు.