కృష్ణాజిల్లాలో ఎప్పుడూ హోరాహోరి పోరు జరిగే నియోజకవర్గం నందిగామ. 2014లో టీడీపీ తరఫున తంగిరాల ప్రభాకరరావు, వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా మొండితోక జగన్మోహనరావు, కాంగ్రెస్ పార్టీ తరఫున వేల్పుల పరమేశ్వరరావు పోటీపడ్డారు. కాంగ్రెస్కు డిపాజిట్లు దక్కలేదు. మొండితోక జగన్మోహనరావుపై ఐదు వేల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు తంగిరాల ప్రభాకరరావు. ఆయన వారసురాలిగా బరిలోకి దిగింది ఆయన కూతురు సౌమ్య. మరి ఇప్పుడు నందిగామలో ఎవరిది గెలుపు చిరునామా?
నందిగామ. కృష్ణ జిల్లాలో కీలక నియోజకవర్గం. ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్. నందిగామలో 2014లో నమోదైన పోలింగ్ శాతం 85.55. అయితే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది నెలలకే నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆయన కుమార్తె తంగిరాల సౌమ్యకు తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించింది. దాదాపు ఏకగ్రీవం అవుతుంది అనుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా బోడపాటి బాబురావు బరిలోకి దింపింది. అయితే తంగిరాల ప్రభాకరరావు మృతి పట్ల సానుభూతి ఉండటంతో, కాంగ్రెస్ అభ్యర్థి బోయపాటి బాబురావుపై 78,827 ఓట్ల మెజారిటీతో తంగిరాల సౌమ్య గెలుపొందారు.
ఇక 2019 ఎలక్షన్స్లో పోటీ ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం మధ్యే ఉంది. అయితే జనసేన కూటమి కూడా పోటీ చేసింది. 2014 ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలైన మొండితోక జగన్మోహనరావు, టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పోటీపడుతున్నారు. ఈసారి కొత్తగా నమోదైన ఓటర్లతో పోలింగ్ శాతం పెరిగింది. మొత్తం ఓటర్లు 1,95,140 కాగా, వీరిలో పురుషులు 84,814, స్త్రీలు 86,805. నమోదైన పోలింగ్ శాతం 87.95. అంటే 2014 కంటే 2 శాతం పోలింగ్ పెరిగింది. పెరిగిన ఓటు మరి ఎవరికి మేలు చేస్తుందో, ఎవరికి చేటు చేస్తుందోనన్న చర్చ జరుగుతోంది. టీడీపీ, వైసీపీలు మాత్రం గెలుపుపై దీమా వ్యక్తం చేస్తున్నాయి.