స్టీల్ సిటీలో సీటును ఎవరు కన్ఫార్మ్ చేసుకోబోతున్నారు. జనసేనాని పవన్, గాజువాకలో పాగా వేస్తారా లేక స్థానిక నేతలకే అక్కడి ప్రజలు పట్టం కట్టబోతున్నారా ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన గాజువాక సెగ్మెంట్లో ఏం జరగబోతుంది. ఉక్కునగరంలో ఎవరు లీడర్ కాబోతున్నారు. గాజువాక పోలింగ్ పల్స్ పై స్పెషల్ రిపోర్ట్.
విశాఖపట్నం గాజువాక ఈసారి అందరి దృష్టినీ ఆకర్షించింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడమే అందుకు కారణం. గాజువాకలో 2,90,224 మంది ఓటర్లున్నారు. పురుషులు 1,34,150, మహిళలు 1,28,211. కాపు, యాదవ, గవర, రెడ్డి సామాజిక వర్గ ప్రజలు ఎక్కువుగా వున్నారు. అయితే పారిశ్రామిక ప్రాంతం కావడంతో స్థానికుల కన్నా స్థానికేతరులు ఎక్కువుగా వున్న ప్రాంతం గాజువాక. అందుకే గాజువాక తీర్పుపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
గాజువాక ఎన్నికల చరిత్రను ఒకసారి తిరగేస్తే, 2009లో 11 మంది అభ్యర్ధులు ప్రధాన పార్టీలు, స్వతంత్రులుగా పోటీ చేసినా పీఆర్పీ నుంచి చింతలపూడి వెంకట్రామయ్య గాజువాక ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత 2014 ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి దాదాపు 18 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. వారిలో టీడీపీ నుంచి పల్లా శ్రీనివాస్ను జనం గెలిపించారు. 2014లో టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు, వైసీపీ నుంచి తిప్పల నాగిరెడ్డి మధ్య హోరాహోరీ పోరు జరగగా, 21,712 ఓట్ల మెజారీటీతో పల్లాకు ప్రజలు పట్టంకట్టారు.
2019 ఎన్నికల్లోను మరోసారి టీడీపీ నుంచి పల్లా శ్రీనివాస్, వైసీపీ అభ్యర్థిగా తిప్పల నాగిరెడ్డి బరిలో వుండగా, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పోటీకి వచ్చారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్ధుల్లో వణుకు మొదలైంది. పవన్ రాకతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారాయి. అయితే పవన్ భీమవరంలో కూడా పోటీకి నిలవడంతో రెండు పడవల ప్రయాణం ఎంతవరకు కలసి వస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పవన్కు గాజువాక నుంచి అవకాశం రాకపోతే ఆ ఓటింగ్ అంతా వైసీపీకి కలిసి వస్తుందని వైసీపీ నేత తిప్పల నాగిరెడ్డి అంచానా వేస్తున్నారు. మరోవైపు టీడీపీ సంక్షేమ పథకాలతో పాటు సామాజిక లెక్కలు, తమ కుటుంబానికి అక్కడి ప్రజల్లో వున్న ఆదరణ తమకు కలసి వస్తుందని సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గెలుపు దీమా వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి. స్టీల్ సిటీ సీటును ఎవరు దక్కించుకుంటారో.