సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటి ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంచలనం నిర్ణయం తీసుకుంది. రాబోయే కాలంలో లక్షలకొద్దీ అనుమాన్సాద వాట్సాప్ ఖాతాలను తొలగించనుంది. ముఖ్యంగా ఫేక్ న్యూస్లను సృష్టించే గ్రూపులే టార్గెట్. అంతేకాదు దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు కూడా హెచ్చరికలను జారీ చేసింది వాట్సాప్ యాజమాన్యం.
నెటిజన్లకు చాలా దగ్గరగా ఉంటూ భారతదేశంలోనే అతి పెద్ద ప్లాట్ ఫాంగా తయారైంది వాట్సాప్. నెలకు 230 మిలియన్ల మంది వాట్పాప్ వినియోగిస్తున్నారంటేనే చెప్పొచ్చు దాని మార్కెట్ ఏంటో. అయితే యూజర్ల భద్రత విషయంలో అంతే అలర్ట్గా ఉంటుంది వాట్సాప్ యాజమాన్యం. 2019 సాధారణ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రూమర్లకు, పనికిరాని వైరల్ మెసేజ్లకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది.
హద్దు మీరి ఎవరైతే రూమర్లను ఫార్వార్డ్ చేస్తారో వారి అకౌంట్లు బ్లాక్ అయిపోయినట్లే. పార్టీ కార్యకర్తలు ప్రచారానికి వాట్సాప్ను ఎక్కువగా వాడుకుంటున్నారట. అంతేకాకుండా ప్రతిపక్షాలపై యాంటీ ప్రచారానికి కూడా ఫొటోలను మార్ఫింగ్ చేసి జనాల్లో చెడు ప్రచారం చేస్తున్నారట.
ఎన్నికల సమయంలో బల్క్గా సందేశాలను పంపించే అవకాశం ఉందని, తద్వారా తాము అందించే ఉచిత సేవ దుర్వినియోగంకానుందని వాట్సాప్ వ్యాఖ్యానించింది. ఈ ప్రయత్నాలను అడ్డకునే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాట్సాప్ ఒక ప్రకన జారీ చేసింది. దీని ద్వారా తమ మెసేజింగ్ ప్లాట్ఫాంను సురక్షితంగా ఉంచాలని భావిస్తునట్టు తెలిపింది.
వివిధ గ్రూపుల ద్వారా పెద్ద ఎత్తున వాట్సాప్ సందేశాలను పంపిస్తున్న ఖాతాలను గుర్తించి మరీ వేటు వేయనుంది. నెలకు 20లక్షల అనుమానిత ఖాతాలను రద్దు చేస్తోందట. తమది బ్రాడ్కాస్ట్ ప్లాట్పాం కాదు అనే విషయాన్ని దేశంలోని పలు రాజకీయ పార్టీలు గుర్తించాలని వాట్సాప్ కమ్యూనికేషన్ హెడ్ కార్ల్ వూగ్ ప్రకటించారు. వివాదాస్పద అకౌంట్లను నిషేధిస్తామని ఆయన హెచ్చరించారు.