పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాదుల తయారీ ఫ్యాక్టరీ నడుస్తోందా..? పాక్ కేంద్రంగానే దాడులకు కుట్రలు చేస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. పాకిస్థాన్లోని బహవాల్పూర్-కరాచీ హైవేకు ఆనుకుని ఉన్న 9 ఎకరాల స్థలంలోనే భారీ తీవ్రవాద శిక్షణ కేంద్రం నడుస్తోంది.
భారత్-పాకిస్థాన్ మధ్య తాజా ఉద్రిక్తతలకు కారణం జైష్ ఏ మహమ్మద్ తీవ్రవాద సంస్థ. పుల్వామాలో భారత సైనిక కాన్వాయ్పై ఆత్మాహుతి దాడికి తెగబడింది తామేనని ప్రకటించిన ఈ సంస్థ పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాదుల తయారీ ఫ్యాక్టరీని నడుపుతోంది. ఖైబర్-పఖ్తున్ఖవా ప్రావిన్సులోని బహవాల్పూర్ సమీపంలో ఆ సంస్థకు భారీ తీవ్రవాద శిక్షణ కేంద్రం ఉన్నట్లు తాజాగా వెలుగుచూసిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ సంస్థకు ముకుతాడు వేయాలని పాకిస్థాన్పై ప్రపంచ దేశాలు ఒత్తిడి తెస్తున్నప్పటికీ జైష్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజహర్ ఆధ్వర్యంలో ఇక్కడ దర్జాగా శిక్షణ కేంద్రం నడుస్తోంది. 2008 నవంబరు 26న ముంబయిపై తీవ్రవాద దాడి జరిగిన తర్వాత కొన్ని నెలలకు 2009లో మసూద్ అజహర్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ రషీద్ అల్వీ పాకిస్థాన్లోని బహవాల్పూర్-కరాచీ హైవేకు ఆనుకుని తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమిని కొన్నాడు. అహ్మద్ నయీమ్ అనే వ్యక్తి 7.6 లక్షలకు ఈ భూమిని రవూఫ్కు విక్రయించాడు. ఆ స్థలంలోనే తీవ్రవాద శిక్షణ కేంద్రం ప్రారంభమైంది. దాదాపు 12వేల మందికి శిక్షణ ఇచ్చేలా దీన్ని తీర్చిదిద్దారు.
అక్కడ క్రీడా స్థలాలు, ప్రార్థనా మందిరాల్ని అభివృద్ధి చేశారు. స్థలం యజమాని రవూఫే. జబా గ్రామానికి పైభాగంలో మన్షేరా-బాలాకోట్ రోడ్డుపై ఓ సైన్ బోర్డును ఏర్పాటుచేశారు. 'మదార్సా తలీమ్ అల్ ఖురాన్ అంటే ఖురాన్ అధ్యయన కేంద్రం అని దానిపై రాసి ఉంటుంది. దీని సంరక్షకుడు మసూద్ అజహర్ అని, అతని బావ మరిది మహమ్మద్ యూసుఫ్ అజహర్ ఈ కేంద్రం ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జి అని బోర్డుపై రాశారు. ఈ ప్రాంగణంలోనే జామా-ఎ-మజీద్ సుభానల్లా, సబీర్ సెమినరీలు ఉన్నాయి. పుల్వామాపై దాడి తర్వాత వీటి నిర్వహణను తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.
అయితే, అక్కడ ఎలాంటి తీవ్రవాద శిక్షణ కేంద్రం నడవడం లేదని, 600 మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారని, వీరికి ఏ నిషిద్ధ సంస్థతోనూ సంబంధం లేదని బహవాల్పూర్ డిప్యూటీ కమిషనర్ షహజిబ్ సయీద్ బుకాయిస్తున్నారు. కానీ, పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాదుల తయారీ ఫ్యాక్టరీ నడుస్తుందన్నది మాత్రం నగ్న సత్యం.