పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే, ఒక వైబ్రేషన్. మెగా అభిమానులకు రెవల్యూషన్. వేదిక దద్దరిల్లే సమ్మోహన ప్రసంగం. తూటాల్లా దూసుకొచ్చే మాటల ప్రవాహం. కానీ 2014లో, జనసేనానిలో కనిపించిన వేగం, సరిగ్గా ఎన్నికల టైంలో ఎందుకు మందగిస్తోంది మొన్నటి వరకూ సీఎం అవుతానన్న పవన్, ఇప్పుడెందుకు ఆ మాటే అనడం లేదు? ఎన్నికల ముంచుకొస్తున్నా, జనసేనానిలో అసంతృప్తికి కారణమేంటి? ఎందుకు అంతర్మథనంతో అల్లాడిపోతున్నారు?
ఎన్నికలు ముంచుకొస్తున్నాయ్
అయినా సందడి కనిపించదేం?
డేటా ఇష్యూతో 2 స్టేట్స్
అట్టుడుకుతున్నా మౌనమేంటి?
ఆశించినంత వలసల్లేక
అంతర్మథనంలో పడ్డారా?
వామపక్షాలతో పొత్తులపై
గందరగోళం ఎందుకు?
కాకినాడ నుంచి అన్నయ్యను
బరిలోకి దింపడం ఖాయమా?
ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో
జనసేనలో అసలేం జరుగుతోంది?
ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు, ప్రశ్నిస్తానంటూ, 2014లో చెలరేగిపోయిన పవన్ కల్యాణ్పై దూసుకొస్తున్నాయి. అభ్యర్థులు, మ్యానిఫెస్టోలతో ప్రధాన పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నా, జనసేనలో ఆ సందడి కనిపించడం లేదు. డేటా ఇష్యూతో రెండు ప్రధాన పార్టీలు కొట్టుకుంటున్న, ఆ పరిణామాలను క్యాష్ చేసుకునే వ్యూహం పవన్కు కానరావడం లేదు. ఎన్నికలు దూసుకొస్తున్నా, జనసేనలో అసలేం జరుగుతుందో ఎవరికీ బోధపడ్డం లేదు.
మెన్నటి వరకూ చాలా కాన్పిడెంట్గా కనిపించిన పవన్, ఈమధ్య కాస్త అసంతృప్తిగా కనిపిస్తున్నారు. ఇటీవల ఆయన ప్రసంగాల్లో మార్పు కనిపిస్తుండడమే ఇందుకు నిదర్శనం. అయితే పవన్లో అసంతృప్తికి బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు పార్టీ నేతలు.
పవన్ అనుకున్నది ఒకటైతే ప్రస్తుతం పార్టీలో జరుగుతున్నది మరోటి. ఎన్నికల సమయంలో తన పార్టీలోకి వలసలు భారీగా ఉంటాయని పవన్ భావించారు. మొదట్లో పార్టీలో కేవలం కొత్తవారికి మాత్రమే అవకాశం ఇస్తానన్న పవన్, తరువాత పార్టీకి సీనియర్లు కావాలని చెప్పారు. జనసేనలోకి ఇతర పార్టీల నుంచి నేతలు వస్తే, తాను స్వాగతిస్తానని ప్రకటనలు చేశారు. అయితే పవన్ గేట్లు తెరిచినా పార్టీలోకి అనుకున్నంత స్థాయిలో వలసల ప్రవాహం లేదు.
నాదెండ్ల మనోహర్ చేరిక తరువాత పార్టీలోకి వలసలు పెరుగుతామని లెక్కలేశారు జనసేన అధినేత. ఏ సభయినా, రోడ్ షో అయినా, నాదెండ్ల పక్కనే కనిపించారు. అయితే నాదెండ్ల చేరిక తరువాత కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీలో చేరారు. రావెల కిషోర్ బాబు, ఆకుల సత్యనారాయణ చేరిక తరువాత మరికొంత మంది క్యూ కడతారని అనుకున్నా, ఆవిధంగా జరగలేదు. జనసేనలోకి వెళ్లాల్సిన ఎమ్మెల్యేలు వైసీపీలో చేరిపోయారు. ముఖ్యంగా ఆయన సామాజిక వర్గానికి చెందిన, సన్నిహితంగా ఉండేవారు సైతం పార్టీలో చేరకపోవడం వంటి అంశాలపై పవన్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.
ప్రజారాజ్యం సమయంలో పార్టీలోకి చేరికలు, పెద్ద ఎత్తున జరిగాయి. అప్పటి టీడీపీ, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు ప్రజారాజ్యంలో చేరారు. కాని జనసేన విషయంలో అలా జరగడంలేదు. నలుగురైదుగురు మినహా పార్టీలో అందరూ కొత్తవారే. ఇటీవల పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలోనూ అందరూ కొత్తవారే. అయితే పార్టీలో కేవలం కొత్తవారే ఉండటం మిగిలిన పార్టీల నుండి వలసలు లేకపోవడంతో, పవన్ బాగా డిజప్పాంయింట్ అయ్యారని తెలుస్తోంది. అయితే ప్రజారాజ్యంలోకి వచ్చిన నేతలు స్వార్ధం కోసమే వచ్చారని, అందుకే పార్టీ నష్టపోయిందని జనసేన ఆవిధంగా కాకూడదని, ముందునుండీ జాగ్రత్తులు తీసుకుంటున్నారు పవన్. ఆ అతిజాగ్రత్తలతోనే పార్టీలోకి వలసలు రావడంలేదని రాజకీయ పండితుల విశ్లేషణ.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వలసలతో పార్టీకి ఊపు వస్తుందని భావించిన పవన్, పరిస్థితి అందుకు భిన్నంగా ఉండడంతో అసంతృప్తిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తానంటున్న పవన్, కొత్తవారినే బరిలోకి దించితే ఫలితాలు ఎలా ఉంటాయో అనే ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.